కరోనా వైరస్ సోకిన కణాల ఫోటోలు విడుదల చేసిన శాస్త్రవేత్తలు
By: Sankar Mon, 14 Sept 2020 4:24 PM
కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచీ శాస్త్రవేత్తలు దీని గుట్టువిప్పేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఓ పక్క కొవిడ్ వ్యాక్సిన్ కోసం శ్రమిస్తూనే... మరోపక్క మన శ్వాసకోశ కణాల్లోకి వైరస్ ఎలా చేరుతుంది.. కణాల్లో వైరస్ ఆకృతి ఎలా ఉంటుంది? అనేదానిపై పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. అయితే, ఈ విషయంలో తాజాగా నార్త్ కరోలినా విశ్వవిద్యాలయ సైంటిస్టులు విజయం సాధించారు. కరోనావైరస్ శ్వాసకోశ కణాల్లో ఉన్న ఫొటోలను వారు స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని ఉపయోగించి చిత్రీకరించగలిగారు.
నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం (యూఎన్సీ) చిల్డ్రన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కెమిల్లె ఎహ్రేతో సహా పరిశోధకులు ఈ చిత్రాలను సంగ్రహించారు. పరిశోధనలో భాగంగా వీరు మనిషిలోని ఊపిరితిత్తులలోగల బ్రాంకియల్ ఎపిథీలియల్ కణాలలో కరోనావైరస్ (సార్స్ సీఓవీ -2)ను టీకాల ద్వారా పంపించారు. అనంతరం వారు 96 గంటల తరువాత అధిక శక్తితో కూడిన స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని ఉపయోగించి పరిశీలించారు.
అధిక శక్తి మాగ్నిఫికేషన్ ఉపయోగించి వాటి ఫొటోలను చిత్రీకరించారు. ఒక్కో కణంలో ఎన్ని వైరస్లు ఉత్పత్తి అవుతున్నాయి.. అవి అక్కడి నుంచి ఎలా వెళ్తున్నాయో ఈ ఫొటోల ద్వారా తెలుసుకోగలిగారు. ఈ ఫొటోలను ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ ప్రచురించింది.
కరోనా సోకిన వారిలో వైరస్ శ్వాససంబంధిత వ్యవస్థ పైపొరపై అధిక మొత్తంలో ఉంటోందని ఫొటోల ఆధారంగా తెలిసింది. ఇది అక్కడినుంచి మిగతా అవయవాల్లోని కణాలపై దాడి చేస్తోంది. మానవ శరీరంలో కొన్ని కణాలు నిద్రాణమై లేక ఇన్యాక్టివ్గా ఉంటాయి. అలాంటి కణాలను కరోనా వైరస్ లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఫొటోల ఆధారంగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ఫొటోలు మాస్కు ఆవశ్యకతను తెలియజేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వచ్చినా.. రాకపోయినా మాస్కు వాడడం తప్పనిసరని అంటున్నారు. బయటకు వెళ్లినప్పుడు ప్రతిఒక్కరూ నాణ్యమైన మాస్కు పెట్టుకుంటే దీనిని అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు.