Advertisement

  • దారుణం: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే నీచానికి పాల్పడ్డాడు...!

దారుణం: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే నీచానికి పాల్పడ్డాడు...!

By: Anji Wed, 16 Dec 2020 4:27 PM

దారుణం: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే నీచానికి పాల్పడ్డాడు...!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే నీచానికి పాల్పడ్డాడు.

పాఠశాల లేకపోయినా తరగతుల పేరుతో విద్యార్థినులను పిలిపించి కీచకపర్వానికి దిగాడు. లైంగిక దాడికి గురైన విద్యార్థిని ఆస్పత్రి పాలవడంతో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.

మిగిలిన విద్యార్థినుల తల్లిదండ్రులు నిలదీయడంతో కీచకుడి బాగోతం బయటపడింది. ఆగ్రహం చెందిన గ్రామస్తులు హెడ్మాస్టర్‌ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం పంచాయతీ పరిధిలోని చింతవర్రె మండల పరిషత్ పాఠశాల హెడ్మాస్టర్ సునీల్ కుమార్ కీచకుడిగా మారాడు.

పాఠశాలలో కేవలం 11 మంది విద్యార్థుల్లో ఐదుగురు బాలికలు. చిన్నారులపై కన్నేసిన దుర్మార్గుడు పాఠశాల లేకపోయినా తరగతుల పేరుతో రప్పించి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో భయపడి బాలికలు మిన్నకుండిపోయారు. అదే అవకాశంగా తీసుకున్న హెడ్మాస్టర్ అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అత్యాచారానికి గురైన బాలిక ఆరోగ్యం బాలేదని ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో దారుణం బయటపడింది.

ఆమెపై లైంగికదాడి జరిగినట్లు తెలియడంతో మరో పాఠశాల టీచర్ రంగంలోకి దిగాడు. పెద్దమనుషుల పంచాయితీ పెట్టి విషయం తొక్కిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

రెండు రోజులపాటు జరిగిన ఈ వ్యవహారం మిగిలిన విద్యార్థినుల పేరెంట్స్‌కి తెలియడంతో హెడ్మాస్టర్‌ని నిలదీశారు.

చిన్నారులపై లైంగిక దాడి ఘటనతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు, గ్రామస్తులు కీచక హెడ్మాస్టర్‌ని చితకబాదారు.

విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, సీడీపీవో తదితరులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు.

చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో చర్చించారు. హెడ్మాస్టర్ సునీల్‌కుమార్‌ని తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో సోమశేఖరశర్మ ప్రకటించారు.

ఆస్పత్రి పాలైన బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కీచకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు

Tags :

Advertisement