ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో కుంభకోణం
By: Dimple Thu, 10 Sept 2020 10:56 AM
రైతుల కోసం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలోనూ భారీ కుంభకోణానికి పాల్పడిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. లబ్ధిదారుల జాబితాలో ఐదు లక్షలకుపైగా అనుమానాస్పద పేర్లు నమోదైనట్లు విపక్ష నాయకులు విమర్శించారు. తమిళనాడులోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లోనే ఇలా ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నారు. అనర్హుతల లబ్ధిదారుల వల్ల దాదాపు రూ.110 కోట్లు మోసం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రూ.32 కోట్లను రికవరీ చేశామని తమిళనాడు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
జాబితాలో అనర్హులు ఉన్నారని తేలడంతో వ్యవసాయ శాఖ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు స్కాంకు సంబంధించి 18 మందిని అరెస్ట్ చేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి గగన్దీప్ సింగ్ బేడీ తెలిపారు. ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లను సస్పెండ్ చేశామని, 34 మంది అధికారులపై చర్యలు, 80 మంది తాత్కాలిక సిబ్బందిని డిస్మిస్ చేసినట్లు వెల్లడించారు. విల్లుపురం, కల్లాకురిచ్చి జిల్లాల్లో అవకతవకలు జరిగినట్లు చెప్పారు.
సీబీ సీఐడీ బృందాలు కడలూరు, సేలం, కల్లాకురిచి, విల్లుపురం, తిరువన్నామలై జిల్లాల్లో విచారణ చేపడుతున్నట్లు తమిళనాడు వ్యవసాయ శాఖ కార్యదర్శి గగన్దీప్ సింగ్ తెలిపారు. ప్రతి నకిలీ నమోదు కోసం రూ.6వేలను వసూలు చేశారని, దాని కోసం వ్యవసాయ శాఖ అధికారిక లాగిన్, పాస్వర్డ్ను వాడుకున్నట్లు తేలిందన్నారు.
లాక్డౌన్ కాలంలో అంటే జూన్ నుంచి ఇలాంటి నకిలీ నమోదులు జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. పీఎం కిసాన్ కుంభకోణంపై ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ప్రతిపక్షం డీఎంకే మాత్రం దీనిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేసింది.