- హోమ్›
- వార్తలు›
- ప్రపంచ వ్యాప్తంగా ఒక తరం మొత్తం చదువు దూరమవడం ఇదే తొలిసారి ..సేవ్ ది చిల్డ్రన్ సంస్థ
ప్రపంచ వ్యాప్తంగా ఒక తరం మొత్తం చదువు దూరమవడం ఇదే తొలిసారి ..సేవ్ ది చిల్డ్రన్ సంస్థ
By: Sankar Mon, 13 July 2020 7:13 PM
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో దాదాపు 1.6 బిలియన్ మంది పిల్లలు పాఠశాలకు, యూనివర్సిటీలకు దూరమయ్యారని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ తెలిపింది. ఒక తరం మొత్తం పిల్లల చదువు పాడవ్వడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అన్నది. యునెస్కో డాటాను ఆధారంగా చేసుకుని సేవ్ ది చిల్డ్రన్ ఓ నివేదిక వెల్లడించింది.
ఫలితంగా 90-117 మిలియన్ల మంది పిల్లలు పేదరికంలోకి నెట్టబడతారని నివేదిక అంచనా వేసింది. కరోనా వల్ల ఏర్పడ్డ ఆర్థిక నష్టాలను భరించడం కోసం చాలా మంది పిల్లలు బలవంతంగా పనులకు వెళ్లాల్సి వస్తుందని.. బాల్య వివాహాల సంఖ్య పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. అంతేకాక దాదాపు 9.7 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు తలెత్తుతాయని నివేదిక తెలిపింది.
అంతేకాక 2021 నాటి అన్ని దేశాల బడ్జెట్లలో విద్యకు కేటాయింపులు భారీగా తగ్గుతాయని.. ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తం 77 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంటుందని సేవ్ ది చిల్డ్రన్ నివేదిక అంచాన వేసింది. అంతేకాక ఈ చర్యల వల్ల పేద-ధనిక, ఆడ-మగ అంతరాలు మరింత పెరుగుతాయన్నది.
దీని నుంచి బయటపడటం కోసం ప్రభుత్వాలు, దాతలు పిల్లలందరికి సురక్షితమైన, నాణ్యమైన విద్యనందించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరింది. ఇప్పటికే పేద, అట్టడుగు వర్గాల పిల్లలు సగం విద్యా సంవత్సరం నష్టపోయారని నివేదిక తెలిపింది. విద్యా కార్యక్రమాల కోసం దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు 77 బిలియన్ డాలర్లు కేటాయించాల్సి వస్తుందని నివేదిక అంచనా వేసింది.