బాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు... సారా, శ్రద్ధా కపూర్ విచారణ
By: chandrasekar Tue, 22 Sept 2020 02:30 AM
బాలీవుడ్ లో కలకలం
రేపుతున్న డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హీరోయిన్లు సారా అలీఖాన్, శ్రద్ధా
కపూర్ ను విచారించనున్నది. త్వరలో వారిని నోటీసులు పంపి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతితో డ్రగ్స్ దర్యాప్తును విస్తృతం చేసిన ఎన్సీబీ
ఇప్పటికే పలువురి నుంచి సమాచారాన్ని సేకరించింది. రానున్న రోజుల్లో మరికొందరిని
కూడా పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. "ఈ వారం సారా అలీఖాన్, శ్రద్ధా
కపూర్ లను ప్రశ్నించడానికి సమన్లు పంపుతున్నాం. త్వరలో మరింత మందిని పిలిచే
అవకాశాలు ఉన్నాయి" అని ఎన్సీబీ అధికారి ఒకరు చెప్పారు. అందిన సమాచారం మేరకు
నటి రకుల్ ప్రీత్ సింగ్, ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ కంబట్టలను కూడా ఎన్సీబీ
పిలువనున్నది. వచ్చే వారం దర్యాప్తుకు సహకరించాలని అధికారులు వారిని అడుగనున్నారు.
"కేదార్నాథ్" సినిమాలో సారా అలీ ఖాన్ సుశాంత్తో
కలిసి నటించగా, శ్రద్ధా కపూర్ "చిచోర్" లో సుశాంత్ తో
నటించింది. పార్టీల కోసం పుణెకు సమీపంలో ఉన్న ఒక ద్వీపానికి వారు అనేకసార్లు
వెళ్లినట్లు తేలిన తరువాత వీరిపై డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ
ముందుకొచ్చిన్నట్లు ఎన్సిబి వర్గాలు తెలిపాయి. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా
చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి, సుశాంత్
వ్యక్తిగత సిబ్బంది దీపేశ్ సావంత్, ఇంకా పలువురిని డ్రగ్స్ సేకరించి రవాణా చేశారనే
ఆరోపణలతో ఎన్సీబీ అరెస్టు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి
వచ్చిన అభ్యర్థన మేరకు ఎన్సీబీ కేసును నమోదు చేసింది.