సంజయ్ మంజ్రేకర్కి ఐపీఎల్ కామెంట్రీ ఫ్యానల్లో చోటు లేదు
By: chandrasekar Sat, 05 Sept 2020 1:12 PM
తాజాగా బీసీసీఐ ఐపీఎల్ 2020 సీజన్ కోసం కామెంట్రీ ఫ్యానల్ని ప్రకటించింది. ఏడు మందితో కూడిన ఈ ఫ్యానల్లో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్కి చోటు దక్కలేదు.
2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని అరకొర ఆటగాడంటూ అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్న మంజ్రేకర్ ఈ ఏడాది మార్చిలో బీసీసీఐ కామెంట్రీ ఫ్యానల్లో చోటు దక్క లేదు. గతంలోనూ వెస్టిండీస్ పవర్ హిట్టర్ కీరన్ పొలార్డ్, సహచర కామెంటేటర్ హర్షాభోగ్లేని అవహేళన చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్
2018 సీజన్లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ గురించి సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. పొలార్డ్ మతిలేని ఆటగాడంటూ వివాదాస్పదరీతిలో వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత 2019లో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన డే/నైట్ టెస్టులో గులాబి బంతి స్పందించే తీరు గురించి చర్చిస్తూ హర్షాభోగ్లేని అవగాహన లేని కామెంటేటర్గా మార్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఈ రెండు సందర్భాల్లో బీసీసీఐ పెద్దలు మౌనంగా ఉండిపోయారు. జడేజాపై మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై బాగా సీరియస్ అయ్యారు.
బీసీసీఐ కామెంట్రీ ఫ్యానల్లో చోటు కోల్పోయిన సంజయ్ మంజ్రేకర్ బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే టోర్నీలతో పాటు టీమిండియా ఆడే మ్యాచ్లకి కూడా కామెంట్రీ చెప్పడానికి అనర్హుడిగా మారాడు. అయితే ఇటీవల తాను చేసిన తప్పిదాన్ని ఒప్పుకున్న మంజ్రేకర్ ఇకపై నిబంధనలకి లోబడి నడుచుకుంటానని బీసీసీఐకి లేఖ రాశాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2020 సీజన్ కామెంట్రీ ఫ్యానల్లోనూ తనకి చోటివ్వాలని అభ్యర్థించాడు. కానీ బీసీసీఐ మాత్రం అతనికి చోటు ఇవ్వలేదు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు జరగనుండగా ఏడు మందితో తాజాగా కామెంట్రీ ఫ్యానల్ని బీసీసీఐ ప్రకటించింది. సునీల్ గవాస్కర్, ఎల్. శివరామకృష్ణన్, మురళీ కార్తీక్, దీప్ దేశ్గుప్త, రోహన్ గవాస్కర్, హర్షా భోగ్లే, అంజుమ్ చోప్రాలకి ఈ ఫ్యానల్లో చోటు దక్కింది.
2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా ఐపీఎల్ కామెంట్రీ ఫ్యానల్లో మంజ్రేకర్ కి మొదటిసారి చోటు దక్కలేదు.