త్వరలో గోమూత్రంతో తయారైన శానిటైజర్స్
By: chandrasekar Thu, 10 Sept 2020 08:54 AM
దేశంలో కరోనా ని కట్టడి చేయడానికి వివిధ మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా గోమూత్రంతో తయారైన శానిటైజర్స్ ను తాయారు చేసి విక్రయించనున్నట్లు తెలిపారు. ఆల్కహాల్తో తయారైన హ్యాండ్ శానిటైజర్స్కి చెక్ పెడుతూ గోమూత్రంతో తయారైన శానిటైజర్స్ త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. గుజరాత్లోని జామ్నగర్కి చెందిన మహిళల పొదుపు సహకార సంఘం ఆవు మూత్రంతో శానిటైజర్స్ తయారు చేసింది. మరో వారం రోజుల్లోనే ఈ హ్యాండ్ శానిటైజర్స్ మార్కెట్లోకి రానున్నట్టు సదరు సహకార సంఘం వెల్లడించింది.
గుజరాత్ లోని మహిళలచేత నిర్వహించబడుతున్న కామధేను దివ్య ఔషధి మహిళా మండలి పేరిట కొనసాగుతున్న సహకార సంఘం గో-సేఫ్ బ్రాండ్ పేరుతో శానిటైజర్ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే విషయమై కామధేను అర్థసేతు డైరెక్టర్ మనీషా మాట్లాడుతూ ఎఫ్డీసీఏ నుంచి గోమూత్రం శానిటైజర్ తయారీ, మార్కెటింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామని వారంలోపు లైసెన్స్ వస్తుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తంచేశారు. గోమూత్ర హ్యాండ్ శానిటైజర్ తయారీలో గోమూత్రంతో పాటు వేప, తులసి వంటి సహజ మూలికలను ఉపయోగించినట్టు మనీషా తెలిపారు.
మన ఆయుర్వేదాలలో గోమూత్రానికి ప్రత్యేక గుర్తింపు వుంది. అందువల్ల చాలామందికి గో మూత్రంతో తయారయ్యే ఔషధాలు, ఉత్పత్తులపై పూర్తి విశ్వాసం ఉంటుందని ఆ నమ్మకంతోనే ఈ ప్రయోగానికి తెరతీసినట్టు మనీషా వెల్లడించారు. ఇదిలావుంటే, గతంలో రాజస్థాన్కి చెందిన ఓ సంస్థ ఆవు పేడతో తయారు చేసిన పేపర్తో డిస్పోజబుల్ ఫేస్ మాస్కులు రూపొందించి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. గోమూత్రంతో హ్యాండ్ శానిటైజర్ వస్తున్నట్టు వార్తలు వెలువడిన మరుక్షణమే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు కూడా మొదలయ్యాయి. కరోనావైరస్కి ఈ గోమూత్ర శానిటైజర్ చెక్ పెడుతుందా అనేదే ఈ చర్చల్లో ప్రధానంగా వినిపించిన సందేహం. ఈ శానిటైజర్ వాడడం వల్ల ఎంతవరకు కరోనా ని కట్టడి చేయవచో వేచిచూడాలి మరి.