యూట్యూబ్ చూసి శానిటైజర్ తయారీ...16 మంది మృతికి కారకుడు
By: chandrasekar Tue, 11 Aug 2020 9:18 PM
ప్రకాశం జిల్లా కురిచేడు, పామూరులో మత్తు కోసం శానిటైజర్ తాగడం వల్ల 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన
నిందితుడు శ్రీనివాస్ సహా 10
మందిని అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ
కేసు వివరాలను ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మీడియాకు వివరించారు. హైదరాబాద్లో
తయారు చేసిన ‘పర్ఫెక్ట్’ సొల్యూషన్స్ శానిటైజర్లే 16 మంది మరణాలకు కారణమని ఎస్పీ వెల్లడించారు. ఎలాంటి
అనుమతులు లేకుండా జీడిమెట్లలో అక్రమంగా నకిలీ శానిటైజర్లను తయారు చేశారన్నారు.
ఈ శానిటైజర్లలో మిథైల్
క్లోరైడ్ను విచ్చలవిడిగా వినియోగించినట్లు విచారణలో తేలిందన్నారు. అక్రమంగా
శానిటైజర్లు తయారు చేస్తూ అధికారులకు చిక్కినా లంచాలు ఇచ్చి బయట పడ్డారని
వెల్లడించారు. ఈ నకిలీ శానిటైజర్లను బెంగళూరు, హైదరాబాద్లోని
ఇతర ప్రాంతాలకు నిందితులు సరఫరా చేశారని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వివరించారు.
కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు సాలె శ్రీనివాస్ను
విచారించిన సిట్ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు.
ఎస్పీ సిద్ధార్థ కౌశల్
తెలిపిన వివరాల మేరకు పేదరికంలో ఉన్న శ్రీనివాస్ ఆదాయంపై ఆకర్షితుడై లాక్డౌన్
సమయంలో ఇంట్లోనే శానిటైజర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్ వీడియోలు
చూసి శానిటైజర్ తయారీ వ్యాపారం ప్రారంభించాడు. ఇది పెట్టిన 10 రోజులల్లోనే బిజినెస్ సక్సెస్ కావడం, ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో ఈ వ్యాపారాన్ని వివిధ
రాష్ట్రాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు వ్యక్తులను కలిసి
హైదరాబాద్ జీడిమెట్లలో పారిశ్రామికవాడ పైప్లైన్ రోడ్డులో ‘పర్ఫెక్ట్
కెమికల్స్ అండ్ సాల్వెంట్స్’ కంపెనీని ఏర్పాటు చేశాడు. అక్కడ తయారు చేసిన
శానిటైజర్ను తెలుగు రాష్ట్రాల్లో సరఫరా చేయడానికి ఇద్దరు పంపిణీ దారులను
నియమించాడు.
శానిటైజర్లను 100 ఎంఎల్ రూ. 50
చొప్పున అమ్మకాలు చేపట్టారు. నిందితుడు శ్రీనివాస్ పెట్రోల్ బంకులో పనిచేసిన
అనుభవంతో కెమికల్స్ని శానిటైజర్గా మిక్సింగ్ చేసి 16 మంది మరణాలకు కారకుడయ్యాడని పేర్కొన్నారు. అయితే
పెరిగిన ఖర్చులకు తగిన ఆదాయం రాలేదనే కారణంతో ఇథైల్ ఆల్కాహాల్కు బదులుగా మరో
ద్రావణాన్ని కలిపి అమ్మాడు. అదే పరిస్థితుల్లో శ్రీనివాస్ కరోనా వైరస్ బారిన
పడటంతో ఆ బాధ్యతలను తన తమ్ముడికి అప్పగించాడు. ఇంతలో కురిచేడు ఘటన వెలుగులోకి
రావడంతో ఆందోళన చెంది విజయవాడలోని తన మిత్రుడి నివాసంలో శ్రీనివాస్ తలదాచుకోగా
అతడి ఆచూకీని తెలుసుకున్న సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.