జీతం అడిగినందుకు ఉద్యోగిని సజీవ దహనం చేసిన యజమాని
By: Sankar Mon, 26 Oct 2020 4:45 PM
రాజస్థాన్లోని కరౌలీలో పూజారిని సజీవ దహనం చేసిన ఘటన మరువక ముందే రాష్ట్రంలోని అల్వర్లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. కుంపుర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు తనకు ఐదు నెలలుగా రావాల్సిన జీతాన్ని అడిగాడని మద్యం దుకాణం యజమాని అతనిని సజీవ దహనం చేశాడు.
పోలీసులకు ఝాడ్కా నివాసి రూప్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదులో తన సోదరుడు కమల్ కిషోర్(23) మద్యం వ్యాపారులు రాకేస్ యాదవ్, సుభాష్చంద్ దగ్గర పనిచేస్తుంటాడని పేర్కొన్నాడు. వారు కుంపుర్-భగెరి మధ్య ఈ దుకాణం నిర్వహిస్తుంటారని తెలిపారు. మద్యం దుకాణదారు తన సోదరునికి ఐదు నెలలుగా జీతం ఇవ్వకుండా వేధిస్తున్నాడని తెలిపారు. బకాయి జీతం అడిగాడని తన సోదరునిపై దాడి చేశారన్నారు.
అయితే ఇంతలో కుంపుర్ మద్యం దుకాణంలో మంటలు అంటుకున్నాయని తెలిసి, అక్కడకు వెళ్లగా తన సోదరుని మృతదేహం డీప్ ఫ్రీజర్లో దొరికిందన్నారు. రాకేష్, సుభాష్ చంద్లు తన సోదరుడిని సజీవ దహనం చేసి, డీప్ ఫ్రీజర్లో దాచారని రూప్ సింగ్ ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.