క్రికెట్ దేవుడి తొలి సెంచరీకి నేటితో ముప్పై ఏళ్ళు
By: Sankar Fri, 14 Aug 2020 12:56 PM
సచిన్ టెండూల్కర్ ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్ మొదలవుతాయి. సచిన్ ఆటకు వీడ్కోలు పలికి ఏడేళ్లు అయిపోయింది.. అయినా ఇప్పటికి అతని గురించి ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రస్తుత టీమిండియా జట్టులో ఉన్న సగం మంది ఆటగాళ్లు అతని ఆటతీరును చూస్తూ పెరిగిన వారే.
దేశంలో క్రికెట్ను ఒక మతంగా భావించే అభిమానులు సచిన్ను క్రికెట్ దేవుడిగా అభివర్ణిస్తారు. క్రికెట్ ఉన్నంతకాలం సచిన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.. కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు, 34 వేలకు పైగా పరుగులు సాధించిన సచిన్.. టెస్టుల్లో మొదటి సెంచరీ సాధించి సరిగ్గా ఈరోజుతో 30 ఏళ్లయింది. సచిన్ సాధించిన మొదటి సెంచరీకి సంబంధించిన ఫోటోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది
1990లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆగస్టు 14న 17 ఏళ్ల వయసులో మొట్టమొదటి సెంచరీ సాధించాడు. ఆరోజు మొదలైన సెంచరీల మోత నిరంతరాయంగా 23 ఏళ్ల పాటు కొనసాగింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు భారత్ జట్టుకు 407 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన సచిన్ 225 నిమిషాల పాటు క్రీజులో ఉన్న సచిన్ 189 బంతులెదుర్కొని 119 పరుగులు సాధించాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 343/6 వద్ద నిలిచి డ్రాగా మిగిలిపోయింది.
మొదటి సెంచరీ సాధించి 30 ఏళ్లయిన సందర్బంగా సచిన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నేను అరంగేట్రం చేసిన మొదటి మ్యాచ్లోనే పాకిస్తాన్ బౌలర్లైన వకార్ యూనిస్, వసీం అక్రమ్ బౌలింగ్ను ఎదుర్కొన్నా. వకార్ వేసిన ఒక బంతి బౌన్సర్గా వచ్చి నా ముక్కును పచ్చడి చేసింది. అయినా ఏమాత్రం బెదరకుండా ఆడాను. . ఒకవైపు ముక్కు నుంచి రక్తం కారుతున్నా.. నొప్పిని భరించి అర్థ సెంచరీ సాధించి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించా. ఎంత కష్టం వచ్చినా క్రికెట్ను మాత్రం వద్దలొద్దని ఆరోజే నిర్ణయించుకున్నా. తర్వాతి రోజుల్లో వంద సెంచరీలు చేస్తానని నేను కూడా అనుకోలేదు.' అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు