తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం ..కానీ భక్తులకు అనుమతి లేదు
By: Sankar Mon, 17 Aug 2020 11:34 AM
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకున్నది. మాస పూజల నిర్వహణ కోసం ఆదివారం ఆలయాన్ని తెరిచారు. ఈ సందర్భంగా చింగం మాస పూజలు అయిదు రోజులు నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం పూజలు ప్రారంభం అయ్యాయి. అయితే కోవిడ్19 నిబంధనలు ఉన్న నేపథ్యంలో.. భక్తులను అనుమతించడం లేదు. ఆలయాన్ని ఈనెల 21వ తేదీన మూసివేస్తారు.
మలయాళం కొత్త సంవత్సర దినం సందర్భంగా ఆగస్టు 17వ తేదీ నుంచి అన్ని అయ్యప్ప ఆలయాలను తెరవాలని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయించింది. దక్షిణ భారత దేశంలో ఆ బోర్డు కింద సుమారు వెయ్యి ఆలయాలు ఉన్నాయి. మళ్లీ ఓనమ్ పూజ కోసం ఆగస్టు 29వ తేదీన శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు.
సెప్టెంబర్ రెండవ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుందని టీడీబీ ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 16వ తేదీన శబరిమల వార్షిక ఉత్సవాలు మొదలు అవుతాయని బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు తెలిపారు.కాగా దేశంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శబరిమల ఆలయం ఒకటి ..రోజుకు కొన్ని వేల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు.అయ్యప్ప మాల ధరించి భక్తులు శబరిమల అయ్యప్ప దర్శనానికి వస్తారు