తెలంగాణలో ఆరో విడుత హరితహారంకు శ్రీకారం చుట్టిన గ్రామీణాభివృద్ధి అధికారులు
By: chandrasekar Sat, 06 June 2020 6:50 PM
‘పచ్చని చెట్టు.. ప్రగతికి మెట్టు’ ఇది రాష్ట్ర
సర్కారు నినాదం! అందుకే ఆకుపచ్చని తెలంగాణకు శ్రీకారం చుట్టి, ఏటా
హరితహారం పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నది. అందులో భాగంగా పెద్ద
సంఖ్యలో మొక్కలు నాటి, సంరక్షిస్తున్నది. ఇప్పటికే ఐదు విడతలుగా చేపట్టి
సక్సెస్ కాగా, వర్షాలు అనుకూలిస్తే ఈ నెల 20 నుంచి
ఆరో విడుత ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు
రావడంతో జిల్లాల వారీగా యంత్రాంగం ఏర్పాట్లలో మునిగిపోయింది. ఇప్పటికే ఊరూరా
నర్సరీల్లో మొక్కలు సిద్ధం కాగా, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సహా వివిధ శాఖలకు టార్గెట్ ఖరారైంది.
ఇటు గుంతలు తవ్వే కార్యక్రమం మొదలు కాగా, మరోసారి మొక్కల పండుగ కనువిందు చేయనున్నది.
అడవుల విస్తీర్ణాన్ని
పెంచి, తెలంగాణను
పచ్చగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా 2015లో
హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఏటా వానకాలం
ప్రారంభంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నది. నాటడంతోపాటు సంరక్షణ చర్యలు
చేపడుతున్నది. ఇప్పటి వరకు ఐదు విడుతల్లో హరితహారం నిర్వహించింది. ప్రస్తుతం ఈ నెల
20 నుంచి
ఆరో విడుత ప్రారంభించనుండగా, జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది.
జిల్లాలో ఈ సారి హరితహారం
లక్ష్యం 71
లక్షలు కాగా, నర్సరీల్లో మాత్రం 1.33 కోట్ల మొక్కలు సిద్ధంగా
ఉన్నాయి. పంచాయతీ రాజ్ చట్టం -2018లో పొందుపర్చిన విధంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో
ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ లెక్కన జిల్లాలోని 18 మండలాల్లోని 380
పంచాయతీల్లో ఏర్పాటయ్యాయి. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ
నర్సరీలతోపాటు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పది నర్సరీలో 1.33 కోట్ల
మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
అటవీ శాఖ వృక్షజాతికి
సంబంధించిన మొక్కలు పెంచుతుండగా, ఉపాధి నర్సరీల్లో టేకు, ఈత, దానిమ్మ, నారింజ, కరివేపాకు, ఖర్జూర, అల్లనేరేడు, చింత, వేపతోపాటు
పూల మొక్కలైన గులాబీ, మల్లె, మందారం, నందివర్దనం లాంటి మొక్కలు సైతం పెంచుతున్నారు.
నర్సరీల్లో సుమారు 75 రకాల మొక్కలను వివిధ సైజుల్లో హరితహారానికి సిద్ధంగా
ఉన్నాయి. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ఒక్కో నర్సరీలో లక్ష నుంచి 1.5 లక్షల మొక్కల వరకు పెంచుతున్నారు. మొక్కల సంరక్షణ
బాధ్యతలను గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఉపాధిహామీ క్షేత్ర సహాయకులకు
అప్పగించారు. కాగా, అటవీప్రాంతాలు, పొలంగట్లపై టేకు మొక్కల పెంపకం చేపట్టేందుకు
ప్రణాళికలు వేశారు.
జిల్లాలో 71 లక్షలు మొక్కలు నాటాలని వివిధ శాఖలు లక్ష్యాలు
విధించుకున్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో కార్యక్రమం నిర్వహిస్తుండగా..
కమ్యూనిటీ, అవెన్యూ, బెన్ఫిషరీ ప్లాంటేషన్ పేరిట మూడు రకాలుగా
నాటుతున్నారు. ఇందులో వ్యవసాయ శాఖ లక్ష, గ్రామీణాభివృద్ధి శాఖ 32 లక్షలు, డీఆర్డీవో
సెర్ప్ శాఖ 30లక్షలు, అటవీ
శాఖ 1.30లక్షలు
ఎక్సైజ్ శాఖకు లక్ష, జగిత్యాల మున్సిపల్కు 1.50లక్షలు, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చెరో లక్ష, ధర్మపురి, రాయికల్
మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చెరో 50వేల మొక్కలను నాటడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా యంత్రాగం ప్రతి గ్రామంలో హరిత రక్షణ
కమిటీలను ఏర్పాటు చేస్తోంది. సర్పంచ్, కార్యదర్శి, హరితరక్షణ కమిటీలు గ్రామ ప్రజలతోపాటు అన్ని శాఖల
అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ హరిత రక్షణ కమిటీలకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు
ఇవ్వనున్నారు.
డ్వాక్రా సంఘాలతో జిల్లాలోని
అన్ని గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించాం. అందుకు అనుగుణంగా ఎవరు ఎలాంటి
మొక్కలు కావాలని సర్వేలో తెలిపారో వారికి ఆ మొక్కలను అందజేస్తాం. జిల్లాలో 380
నర్సరీల్లో 73 రకాలకు చెందిన 1.33కోట్ల మొక్కలను పెంచుతున్నాం. 6వ
విడుత హరితహారంలో 71 లక్షల టార్గెట్ కాగా, వర్షాలు ఎక్కువగా
కురిస్తే ఇంకా ఎక్కువ మొక్కలు నాటుతాం.