నిజమైన అభిమానులు ఎవరూ అలా చేయరు - ఎస్పీ చరణ్
By: Anji Mon, 28 Sept 2020 12:41 PM
మెడికల్ బిల్స్ చెల్లింపుల విషయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబాన్ని చెన్నై ఎంజిఎం హెల్త్కేర్ హాస్పిటల్ వర్గాలు ఇబ్బంది పెట్టిందని ప్రచారం జరిగింది. బిల్లు పూర్తిగా చెల్లించేవరకూ ఎస్పీబీ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదని కొందరు రూమర్స్ పుట్టించారు. హాస్పిటల్ బిల్లులు చెల్లించవలసిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరగా... తిరస్కరించినట్టు వందతులు సృష్టించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ కట్టారని పేర్కొన్నారు. వీటిని ఎస్పీబీ తనయుడు చరణ్ ఖండించారు. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నటువంటి పుకార్లను నమ్మవద్దని బాలు అభిమానులకు ఎస్పీ చరణ్ విజ్ఞప్తి చేశారు. నిజమైన అభిమానులు ఎవరూ అలా చేయరని ఆయన అన్నారు.
ఆసుపత్రి బిల్లులకు సంబంధించి ఎవరెంత చెల్లించారనే వివరాలు త్వరలో విడుదల చేస్తామని, ఇటువంటి వదంతులు ప్రచారంలోకి రావడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో తమిళనాడులోని తామరైపాక్కంలోని తండ్రి సమాధి వద్ద తమ సొంత ఖర్చుతో స్మారకమందిరం నిర్మిస్తామని ఎస్పీ చరణ్ తెలిపారు.
వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ సైతం హాస్పిటల్ బిల్స్ పేరిట వచ్చిన ప్రచారమంతా బోగస్ అనీ, వాటిలో ఏమాత్రం నిజం లేదనీ ఖండించారు. బాలుకు హాస్పిటల్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిందనీ, ఎప్పటికప్పుడు బాలు ఆరోగ్య స్థితిగతుల గురించి తమ తండ్రికి సమాచారం అందిస్తూ వచ్చిందని ఆమె చెప్పారు. ఎస్పీ బాలు కుటుంబం తమకు అత్యంత సన్నిహితమని ఆమె తెలిపారు.