నడిరోడ్డుపై ఆర్టీఏ ఉద్యోగి లంచావతారం...గంటల్లోనే ఆ ఉద్యోగికి షాక్...
By: chandrasekar Sat, 07 Nov 2020 12:06 PM
పశ్చిమగోదావరి జిల్లా
తాడేపల్లి గూడెంలో నడిరోడ్డుపై ఆర్టీఏ ఉద్యోగి లంచావతారం ఎత్తారు. వాహనదారుల నుంచి
ముక్కుపిండి మరీ డబ్బు వసూలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. వాహనాదారుల నుంచి
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మృత్యుంజయరాజు డబ్బులు వసూలు చేస్తున్న ఓ వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అయింది. జాతీయ రహదారిపై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గూడ్స్
వాహనాలను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నాడు. ఈ
తరుణంలో ఓ తెలుగు వ్యక్తికి చెందిన వాహనాన్ని సైతం ఆపివేసి మృత్యుంజయరాజు డబ్బు
డిమాండ్ చేశారు. అది రైతు వాహనమని, డబ్బు ఇచ్చుకోలేనని వేడుకున్నా రైతు లేదు, ఏం
లేదు రూ. 200 కడితేనే అన్నట్లు వీడియోలో రికార్డు అయింది.
ఓ బాధితుడు ఈ వీడియోను
సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియో సంబంధిత శాఖ ఉన్నతాధికారుల
వద్దకు చేరడంతో దీనిపై వెంటనే స్పందించారు. గంటల్లోనే మృత్యుంజయరాజుకు దిమ్మతిరిగే
షాకిచ్చారు. తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్డుపై అధికారిక యూనిఫామ్లో లేకుండా వాహన
డ్రైవర్ల నుంచి లంచాలు వసూలు చేస్తున్న ఎంవీఐ మృత్యుంజయరాజును సస్పెండ్
చేస్తున్నట్లు శుక్రవారం రవాణా శాఖ కమిషనర్ సీతా రామాంజనేయులు ఉత్తర్వులు జారీ
చేశారు.