మెరిసిన పడిక్కల్ , కోహ్లీ .. ఆర్సీబి అలవోక విజయం
By: Sankar Sun, 04 Oct 2020 06:57 AM
రాయల్ ఛాలెంజెర్స బెంగుళూరు ఈ ఐపీయల్ 2020 లో దూసుకుపోతుంది..ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ..తాజాగా నిన్న సాయంత్రం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన బెంగుళూరు అలవోక విజయాన్ని సాధించింది..ఈ మ్యాచ్ తో ఆ జట్టు స్టార్ ఆటగాడు , కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవడం బెంగుళూరు శిబిరంలో తీవ్ర ఉత్సహాన్ని నింపుతుంది..
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్.. టాపార్డర్ ఆటగాళ్లైన స్టీవ్ స్మిత్(5), జోస్ బట్లర్(22), సంజూ శాంసన్(4) వికెట్లను ఐదు ఓవర్లలోపే కోల్పోయింది. ఇసుర ఉదాన వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి స్మిత్ బౌల్డ్ కాగా, కాసేపటికి సైనీ బౌలింగ్లో బట్లర్ పెవిలియన్ చేరాడు. దేవదూత్ పడిక్కల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో బట్లర్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక సంజూ శాంసన్ కూడా విఫలయ్యాడు. దాంతో 31 పరుగులకే రాజస్తాన్ మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై రాబిన్ ఊతప్ప-లామ్రోర్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. కానీ ఊతప్ప(17) నాల్గో వికెట్గా ఔట్ కావడంతో రాజస్తాన్ను లామ్రోర్ ఆదుకున్నాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా లామ్రోర్ మాత్రం నిలకడగా ఆడాడు. 39 బంతుల్లో 1 ఫోర్, 3సిక్స్లతో 47 పరుగులు సాధించి రాజస్తాన్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. ఇది లామ్రోర్కు ఈ సీజన్లో తొలి మ్యాచ్. చివర్లో ఆర్చర్(16 నాటౌట్; 10 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్)), రాహుల్ తెవాటియా(24 నాటౌట్; 12 బంతుల్లో 3 సిక్స్లు)లు ఫర్వాలేదనిపించడంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో చహల్ మూడు వికెట్లు సాధించగా, ఉదాన రెండు వికెట్లు తీశాడు. సైనీకి వికెట్ దక్కింది
ఇక లక్ష్య ఛేదనలో దేవదూత్ పడిక్కల్(63; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్), విరాట్ కోహ్లి((72 నాటౌట్; 53 బంతుల్లో 7 ఫోర్లు, 2సిక్స్లు) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్ నిర్దేశించిన 155 పరుగుల టార్గెట్లో ఆర్సీబీ ఆదిలోనే ఫించ్(8) వికెట్ను కోల్పోయింది. ఆ తరుణంలో పడిక్కల్-కోహ్లిలు 99 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఈ క్రమంలోనే పడిక్కల్ హాఫ్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 124 పరుగుల వద్ద ఉండగా పడిక్కల్ ఔట్ కాగా, ఆపై కోహ్లి-డివిలియర్స్(12 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్)లు లాంఛనం పూర్తిచేశారు. ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఇది ఆర్సీబీకి మూడో విజయం కాగా, రాజస్తాన్కు రెండో ఓటమి.
ఇక ఈ సీజన్లో ఇప్పటివరకూ ఆర్సీబీ నాలుగు మ్యాచ్లు ఆడగా పడిక్కల్ మూడు హాఫ్ సెంచరీలు సాధించడం విశేషం. ఇది ఒక రికార్డుగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో తొలి నాలుగు మ్యాచ్ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా పడిక్కల్ రికార్డు సాధించాడు. దాంతో పడిక్కల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది.