రోహిత్ సిడ్నీ లోనే సేఫ్ గా ఉన్నాడు ...బీసీసీఐ అధికారి
By: Sankar Tue, 22 Dec 2020 4:56 PM
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐపీయల్ సమయంలో గాయపడటంతో ఆస్ట్రేలియా వెళ్లే టీమిండియా జట్టులో తొలుత స్థానం సంపాదించలేకపోయాడు..అయితే ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని ఫిట్ నెస్ నిరూపించుకోవడంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులు ఆడేందుకు రోహిత్ ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్ళాడు...
కరోనా నిబంధనలు ఉండటంతో రోహిత్ మూడో టెస్ట్ జరిగే సిడ్నీ లోనే క్వారంటైన్ లో ఉన్నాడు..అయితే ఆస్ట్రేలియాలో అత్యధికంగా సిడ్నీ లోనే కరోనా కేసులు నమోదు అవుతుండటంతో రోహిత్ గురించి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు...
అయితే రోహిత్ శర్మ సిడ్నీలోని రెండు గదుల అపార్ట్మెంట్లో కఠిన నిబంధనల మధ్య క్వారంటైన్లో ఉన్నాడు. సిడ్నీలో కొత్తగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సిడ్నీలోనే రోహిత్ క్వారంటైన్ను పూర్తి చేస్తాడని, భారత క్రికెట్ బోర్డు, టీమ్ మేనేజ్మెంట్ నిరంతరం అతనితో టచ్లోనే ఉంటున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
రోహిత్ సిడ్నీ నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాడు. బయో సెక్యూర్ వాతావరణంలో క్వారంటైన్లో ఉన్నాడు. గదిలో ఒంటరిగా ఉండగా, భారత బోర్డుతో పాటు టీమ్ మేనేజ్మెంట్ కూడా అతనితో నిరంతరం సంప్రదిస్తూనే ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే లేదా అతను సిడ్నీ నుంచి వెళ్లాలనిపిస్తే అక్కడి నుంచి తరలిస్తాం. ఇప్పుడైతే అతను అక్కడ పూర్తి సురక్షితంగా ఉన్నాడని అధికారి వివరించాడు.