రాత్రికి రాత్రే ఐపీయల్ లో అయిదు టైటిల్స్ సాధించలేదు ..రోహిత్ శర్మ
By: Sankar Sun, 22 Nov 2020 07:46 AM
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఐదోసారి విజేతగా నిలవడంపై ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉందని, పేరున్న కొందరు ఆటగాళ్లు ఉండటం వల్లే విజయాలు దక్కవని రోహిత్ వ్యాఖ్యానించాడు. ప్రతీ చిన్న లోపాన్ని గుర్తించి సన్నాహాలు మొదలు పెట్టామని అతను పేర్కొన్నాడు.
మరో జట్టుతో రోహిత్ ఇలాంటి ఫలితాలు సాధించేవాడా అని కొందరు అడుగుతున్నారు. అసలు నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలి. ఎందుకు సాధించి చూపించాలి. మా ఫ్రాంచైజీ ఆలోచనల ప్రకారమే నేను ఆటగాడిగా, కెప్టెన్గా కావాల్సిన పనితీరును ప్రదర్శించా. ఒక్క రాత్రికి ఫలితాలు రాలేదు.
పొలార్డ్, బుమ్రా, హార్దిక్ పాండ్యాలాంటి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారనే మాటను అంగీకరిస్తా. అయితే 2011లో నాతో సహా అందరూ వేలంలో అందుబాటులో ఉన్నారు కదా. కానీ ముంబై మమ్మల్ని ఎంచుకుంది. మాపై నమ్మకముంచి జట్టును తీర్చి దిద్దుకుంది. ఇష్టమున్నట్లు ఆటగాళ్లను మార్చేయలేదు. బౌల్ట్ గత ఏడాది ఢిల్లీకి, అంతకుముందు సన్రైజర్స్కు కూడా ఆడాడు కదా. ఆరంభంలోనే బంతిని స్వింగ్ చేసి వికెట్లు తీయగల బౌలర్ మాకు అవసరం ఉందని భావించాం. అందుకే ఢిల్లీతో గట్టిగా పట్టుబట్టి బౌల్ట్ను తీసుకున్నాం. ఆపై అతను సత్తా చాటాడు. నా మనసుకు సరైంది అనిపించేది చేయడమే నా విజయ రహస్యం’ అని రోహిత్ విశ్లేషించాడు.