Advertisement

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం...!

By: Anji Fri, 25 Dec 2020 5:14 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం...!

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆవుల్ని ఎవరో దొంగలించారని పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు వాటి అచూకి లభ్యం కాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆవులను దొంగిలించే ముఠా గుట్టు రట్టు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. 2020 అక్టోబర్‌లో తన ఆరు ఆవులు దొంగిలించబడ్డాయన్నారు. అయితే ఇప్పటికే మూడు నెలలు గడుస్తున్నా ఆచూకీ మాత్రం దొరకలేదన్నారు.

తాను నిత్యం పూజలు చేసే ఆవు కూడా దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు. ఈ మేరకు ఆ ఆవుతో జగ్గారెడ్డి దిగిన ఫోటోను విడుదల చేశారు.

ఆవులు లేకపోవడంతో కేవలం ఇంట్లో దూడలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా ఇచ్చానన్నారు. అయితే పోలీసులు వెతుకుతున్నారన్నారు.

కానీ ఆవు దొంగతనం చేసిన వారిని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారాయన. ప్రేమతో పెంచుకున్న ఆరు ఆవులు దొంగిలించినా ఏమి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆవులను మేత కోసం వదిలితే దొంగలు కబేళాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
సంగారెడ్డి లో చాలా ఆవులు, ఎడ్లు దొంగలించబడ్డాయన్నారు. ఇలాంటివి జరగకుండా చూడాలని పోలీస్ వ్యవస్థను డీజీపీని కొరుతున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

అయితే జగ్గారెడ్డి చేసిన ఫిర్యాదుపై మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఓ వైపు బీజేపీ కూడా గోవుల సంరక్షణ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ గోసంరక్షణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Advertisement