కొండెక్కిన కోడి మాంసం ధరలు...
By: chandrasekar Mon, 05 Oct 2020 4:47 PM
దేశంలో కూరగాయాల నుండి
కోడి మాంసం వరకు ధరలు అమాంతం పెరిగి పోయాయి.
కోడి మాంసం ధర కొండెక్కింది. చికెన్ ధరలు బహిరంగ మార్కెట్లో అమాంతం
పెరిగింది. కరోనా భయంతో మార్చి, ఏప్రిల్
మాసాల్లో వినియోగం తగ్గడంతో అప్పట్లో ధరలు భారీగా పతనమయ్యాయి. లాక్డౌన్ ఆంక్షలు
తొలగడంతో ఇప్పుడు జనం చికెన్ తినేందుకు ఎగబడుతున్నారు. చికెన్తో కరోనా రాదని, పైగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు
పేర్కొనడంతో గ్రేటర్లో వినియోగం రెట్టింపైంది.
రాష్ట్రంలో అవసరాలకు తగ్గ
డిమాండ్కు తగిన కోళ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరిగాయి. రెండు వారాల క్రితం
కిలో 170 రూపాయలు ఉన్న చికెన్ ధర ఇపుడు 220–230 రూపాయలకు చేరుకుంది. సాధారణ రోజుల్లో గ్రేటర్ వ్యాప్తంగా లక్ష కిలోల వరకు చికెన్
విక్రయాలు జరుగుతాయి. ఆదివారం లక్షన్నర నుంచి రెండు లక్షల కిలోల విక్రయాలు
జరుగుతాయని మార్కెట్ వర్గాల అంచనా. గ్రేటర్ శివారుతో పాటు తెలంగాణ వ్యాప్తంగా
కోళ్లకు డిమాండ్ పెరిగిందని, అందుకే
ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
వారాంతంలో అధికంగా
అమ్ముడవడంతో ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం కోడి లైవ్ ధర హోల్సేల్ మార్కెట్లో
రూ.122 ఉంది. బహిరంగ మార్కెట్లో ధర రూ.132 నుంచి రూ.140 వరకు
ఉంది. డ్రెస్డ్ చికెన్ ధర పెద్ద హోల్సేల్ మార్కెట్లో రూ.200 వరకు ఉండగా అదే స్కిన్లెస్ కిలో చికెన్ ధర రూ.220–230 దాటుతుంది. కోళ్ల దిగుమతి తగ్గుతుండడంతో మరో రెండు, మూడు రోజుల్లో కేజీ చికెన్ రూ.250 దాటే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.