బక్రీద్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర హోమ్ మంత్రి పోలీసు కమీషనర్ తో సమీక్ష
By: chandrasekar Fri, 31 July 2020 09:39 AM
ముస్లింల పండగ బక్రీద్ ను
పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గురువారం నాడు పోలీసు
కమీషనర్లతో తన కార్యాలయంలో సమీక్షించారు. పొలీసు కమిషనర్లు అంజనీ కుమార్
(హైదరాబాద్), మహేష్ ఎం భగవత్ (రాచకొండ), వి.సి.సజ్జనార్
(సైబరాబాద్) లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆగస్టు 1 వ తేది నుండి మూడు రోజుల
పాటు జరగనున్న బక్రీద్ పండగ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై హోంమంత్రి
చర్చించారు.
హోం మంత్రి మాట్లాడుతూ
జంతువులను కొనుగోలు చేసే సందర్భంలో స్థానిక వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ను
భద్రపరచకోవాలని సూచించారు. జంతువులను రవాణా చేస్తున్న సమయంలో చట్టం ప్రకారం పోలీసు
సిబ్బంది వ్యవహరిస్తారని, ఆవులు తప్ప ఇతర జంతువులను పోలీసులు అడ్డుకోరని
తెలియజేశారు. చట్టం ప్రకారం ఆవులను బలి ఇవ్వరాదని, అదేవిధంగా హిందువులు
గోమాత గా కొలిచే ఆవులను గౌరవించాలన్నారు.
ఈద్గాలలో ప్రార్ధనలకు
అనుమతి లేనందున మసీదులలో ప్రార్థనలను చేసుకోవలసిందిగా హోం మంత్రి సూచించారు. ఎవరి
ఇంటిలో వారు ప్రార్ధనలను చేసుకుంటే ఉత్తమమని స్పష్టం చేశారు. ఐతే , ప్రార్ధనలను
చేసేటప్పుడు భౌతిక దూరం పాటించడం వల్ల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
రానున్న బక్రీదు పండుగ ప్రత్యేక పరిస్థితుల మధ్య జరగనుందని తెలిపారు.
కరోనా వైరస్ ఉన్న
పరిస్థితుల దృష్ట్యా ముస్లిం సోదరులు ప్రత్యేక శ్రద్ధ వహించి పండగ జరుపుకోవాలని
సూచించారు. ప్రార్థనలు ఇళ్ళలోనే చేస్తున్నప్పటికీ అక్కడ కూడా భౌతిక దూరాన్ని
పాటించాలని, మాస్క్ లను ధరించాలని, తరచూ చేతులు శుభ్రం
చేసుకోవాలని అన్నారు. పండగ సందర్భంగా బలి ఇచ్చే జంతువుల వ్యర్ధాలను ఎప్పటికప్పుడు
తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలనీ
తెలియజేశారు.