కరోనా వైరస్ జన్యుపదార్థంలో ఉత్పరివర్తనం పై పరిశోధన
By: chandrasekar Mon, 17 Aug 2020 8:02 PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని అన్ని
దేశాల శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుండగా, మలేషియా శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన
ఓ విస్తుగొలిపే విషయాన్ని వెల్లడించారు. సార్స్ సీఓవీ -2కు చెందిన కొత్త జన్యువును
వారు గుర్తించారు. ఇది ప్రస్తుతం కంటే పదిరెట్లు ఎక్కువగా కరోనా వైరస్ ను వ్యాప్తించెందించగలదని
తేల్చారు. దీంతో కరోనా మ్యుటేషన్ జరుగుతున్నది అనే ఊహాగానాలకు ఇది బలం చేకూర్చుతోంది.
బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం ‘డీ614జీ’ అనే జన్యువు ఒక క్లస్టర్ లోని 45 కేసులలో కనీసం మూడు
కేసులలో ఉన్నట్లు గుర్తించారు. దీనివ్యాప్తి ఇండియా నుంచి తిరిగొచ్చిన ఓ రెస్టారెంట్
యజమాని నుంచి ప్రారంభమైనట్లు తేల్చారు. మలేషియాకు వచ్చిన అతడు 14 రోజుల హోంక్వారంటైన్
నిబంధనలు ఉల్లంఘించగా, అతడికి జైలుశిక్ష, జరిమానాకూడా విధించారు. ఫిలిప్పీన్స్ నుంచి
తిరిగి వచ్చిన వ్యక్తులతో సంబంధం ఉన్న మరో క్లస్టర్ లో కూడా ఈ జాతిని శాస్త్రవేత్తలు
గుర్తించారు.
తాము కరోనా వైరస్ కొత్త జన్యువును గుర్తించామని మలేషియా హెల్త్ డైరెక్టర్ జనరల్
నూర్ హిషమ్ అబ్దుల్లా వెల్లడించారు. కొవిడ్ -19 మ్యుటేషన్ కనుక చెందితే టీకా కోసం చేస్తున్న
అధ్యయనాలు, పరిశోధనలు నిష్ప్రయోజనంగా మారుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలు మరింత
జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ వైరస్ గొలుసును తెంపాలంటే ఉన్న ఒకే ఒక్క అవకాశం సామాజిక
దూరం మాత్రమేనని స్పష్టంచేశారు. కనుక ప్రజలంతా సహకరించాలని ఆయన ఫేస్ బుక్ వేదికగా అభ్యర్థించారు.
ఇదిలా ఉండగా, సార్స్ సీఓవీ -2 వైరస్ వ్యాప్తిని వేగవంతం చేసే విధంగా మ్యుటేషన్ కు సంబంధించిన
కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన ప్రసిద్ధ అంటువ్యాధుల నిపుణుడు
డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కూడా ఇదివరకు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ లో చైనాలోని వూహాన్
లో దీనిని మొదటిసారి గుర్తించినప్పటినుంచి శాస్త్రవేత్తలు కరోనా వైరస్ జన్యుపదార్థంలో
మ్యుటేషన్ (ఉత్పరివర్తనం)పై పరిశోధన సాగిస్తున్నారు. ఐరోపా, యూఎస్ లో వైరస్ మ్యుటేషన్
వైవిధ్యంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఉత్పరివర్తనం
జరగట్లేదని చెప్పింది.