సుప్రీమ్ కోర్ట్ కు వెళ్లిన అర్ణబ్ గోస్వామి...
By: Sankar Wed, 11 Nov 2020 2:13 PM
ఇంటీరియర్ డిజైనర్ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులో నిందితుడిగా ఉన్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి సుప్రీం తలుపు తట్టారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని అర్నబ్ సుప్రీకోర్టును కోరారు.
బాంబే హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరణనూ ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అర్నబ్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసు దర్యాప్తు చట్ట విరుద్ధంగా సాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీల బెంచ్ స్పందిస్తూ.. సదరు జర్నలిస్టుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతున్న పిటిషన్ను మాత్రమే పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ పిటిషన్లో తమ దృష్టికి వచ్చింది కేవలం ఎఫ్ఐఆర్ రద్దు విషయమని సుప్రీం బెంచ్ పేర్కొంది. దీంతో అర్నబ్ తరపు న్యాయవాది సాల్వే మాట్లాడుతూ.. తమ కేసు ఎఫ్ఐఆర్ దశ దాటిపోయిందని, దర్వాప్తు జరిగిన తర్వాతే మే, 2018లో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. ఇక ఈ కేసు పునర్ దర్వాప్తు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారం దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు