బెయిల్ పై విడుదల అయిన అర్ణబ్ గోస్వామి
By: Sankar Wed, 11 Nov 2020 10:17 PM
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్, జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆయన ముంబైలోని తలోజా జైలు నుంచి విడుదలయ్యారు. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్ను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై ఈ నెల 4న అరెస్టైన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
అర్నబ్ బెయిల్ పిటిషన్పై జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరా బెనర్జీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం విచారణ జరిపింది. అర్నబ్తోపాటు ఇద్దరు సహ నిందితులకు కూడా సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. ముగ్గురు నిందితులు వ్యక్తిగత పూచీకత్తు కింద రూ.50 వేల చొప్పున బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. నిందితుల విడుదలలో ఆలస్యం చేయకూడదని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో ముంబైలోని తలోజా జైలులో రిమాండ్లో ఉన్న అర్నబ్ గోస్వామిని బుధవారం రాత్రి విడుదల చేశారు.. జైలు నుంచి విడుదల అయిన అర్నాబ్ కొద్ది దూరం రోడ్ షో నిర్వహించారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు చాలామంది అభిమానులు తరలిరావడం విశేషం. దీంతో.. కారులో నుంచే అర్నాబ్ వారికి అభివాదం చేశారు.