రెడ్ సిగ్నల్ పడగానే వాహనదారులు అందరు ఆ పని చేయండి ..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
By: Sankar Thu, 15 Oct 2020 3:15 PM
ప్రపంచ మొత్తాన్ని వేధిస్తున్న సమస్యలలో వాయు కాలుష్యం కూడా ఒకటి .. ముఖ్యంగా ఢిల్లీలో ఈ వాయు కాలుష్యం చాల ఎక్కవగా ఉంది అందుకే అప్ ప్రభుత్వం సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చింది ..రోడ్డుపై ఎర్ర సిగ్నల్ పడగానే.. వెంటనే వాహనాల్ని ఆఫ్ చేయాలి. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ ఇప్పుడు ఇదే ప్రచారాన్ని నిర్వహించనున్నది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రెడ్లైట్ ఆన్.. గాడీ ఆఫ్ ప్రచారం మొదలుపెట్టనున్నది.
ఢిల్లీలో సుమారు కోటి రిజిస్టర్డ్ వాహనాలు ఉన్నాయని, ఒకవేళ పది లక్షల వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తమ వాహనాల్ని స్విచ్ ఆఫ్ చేస్తే , అప్పుడు పీఎం10 కాలుష్యంలో 1.5 టన్నుల కాలుష్యం ప్రతి ఏడాది తగ్గుతుందని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. సాధారణంగా రెడ్ లైట్ల వద్ద ఓ వాహనం 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండే అవకాశం ఉంటుందని, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బండి ఇగ్నిషన్ ఆఫ్ చేస్తే, అప్పుడు ఢిల్లీలో కాలుష్యం సుమారు 15 నుంచి 20 శాతం తగ్గుతుందని ఆ రాష్ట్ర పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కాలుస్తున్న పంటల వల్ల సుమారు 4 శాతం కాలుష్యం ఏర్పడుతుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ వెల్లడించారని, 15 రోజుల క్రితం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సాధారణంగా ఉందని, అయితే గడిచిన 15 రోజుల్లో ఎందుకింత కాలుష్యం పెరిగిందో తెలుసుకోవాలని ఆయన అన్నారు.