Advertisement

ఏ జాతి కోడికైనా ఎర్రరంగు అడవికోడే మాతృక

By: chandrasekar Mon, 20 July 2020 6:39 PM

ఏ జాతి కోడికైనా ఎర్రరంగు అడవికోడే మాతృక


మనిషి మొదట కోడిని మచ్చిక చేసుకొని కుటుంబంలో భాగంగా మార్చింది ఉత్తర థాయిలాండ్‌, మయన్మార్‌ సరిహద్దుల్లోని కొండల్లో. కున్‌మింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జువాలజీ పరిశోధకులు కోడి జీనోమ్‌ చిత్రాన్ని శోధించి చేధించి ఈ విషయాన్ని తేల్చారు. ఆదిమ మానవుడు అప్పుడప్పుడే వ్యవసాయం నేర్చుకుంటున్నాడు. తిండిగింజలు పండించి నిల్వచేయటం తెలుసుకుంటున్నాడు. నిత్యం తిండికోసం చెట్టుపుట్ట పట్టుకొని తిరగాల్సిన పనిలేకుండా ఇంటిపట్టునే తిండి సంపాదించుకోవాలనే ఆలోచన చేస్తున్నాడు. తన గుడిసెకు సమీపంలో రంగురంగుల ఈకలతో తలపై ఎర్రని పొడవైన అందమైన జుట్టుతో కొక్కొరొకో అంటూ ఎర్రెర్రని పక్షలు తిరుగాడుతున్నాయి. పక్షులే కానీ ఆకాశంలోకి ఎగరలేకపోతున్నాయి. దాంతో మనిషికి తటాలున ఓ ఆలోచన వచ్చింది. చేతిలోని గింజలు వాటివైపు విసిరాడు.

ఒకరోజు రెండోరోజు మూడోరోజు అలా కొద్దిరోజుల్లోనే కోడి గుడిసెలోకి వచ్చింది. మనిషికి మచ్చిక అయ్యింది. ఇక అప్పటినుంచి మనిషితోనే ఉండిపోయింది. దాదాపు క్రీస్తుకు పూర్వం 7,500 సమయంలో థాయ్‌, మయన్మార్‌ కొండల్లో మొదట మనిషి కోడిని మచ్చిక చేసుకున్నాడు.

ఉత్తర చైనాలో భారత్‌లోని సింధునది లోయలో మొట్టమొదట ఒకేసారి కోడిని మనిషి మచ్చికచేసుకున్నాడని మొన్నటివరకు శాస్త్రవేత్తలు భావించారు. కానీ కున్‌మింగ్‌ పరిశోధకులు సెల్‌ రీసెర్చ్‌ మాగజీన్‌లో ప్రచురించిన పరిశోధన వ్యాసంతో ఆ లెక్కలన్నీ తిరగబడ్డాయి.

దాదాపు 50మంది పరిశోధకులు 787 రకాల కోళ్ల జీనోమ్‌ చక్రాలను విశ్లేషించి ఈ నిర్ధారణ చేశారు. ‘మనిషి కోడిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా మచ్చికచేసుకున్నాడు అనేది అత్యంత కీలకమైన అంశం మాత్రమే కాదు. మానవ చరిత్ర, వ్యవసాయ ప్రారంభం ఎప్పుడు అయ్యిందనే అంశంతో కూడా ఇది ముడిపడి ఉన్నది’ అని కున్‌మింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ వాంగ్‌ మింగ్‌ వ్యాఖ్యానించారు.

ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్‌ అయినా కొనుక్కోవడానికి ప్రజలు వెనుకాడేవారు కాదు. కానీ, ఇప్పుడలా కాదు. కరోనా భయంతో కండ్ల ముందు కోడిని కోస్తేనే కొంటామని తెగేసి చెప్తున్నారు. చికెన్‌ సెంటర్లలో జాగ్రత్తలు తీసుకుంటున్నారో? లేదో? అన్న అనుమానంతో ఈ డిమాండ్‌ చేస్తున్నారు. ఈగలు, దోమలు, దుమ్ము, ధూళి, తుంపర్లు చికెన్‌పై పడితే ప్రమాదమేనని, అందుకే కండ్ల ముందు కోస్తే ఏ అనుమానం ఉండదని అభిప్రాయపడుతున్నారు.

డార్విన్‌ చెప్పిన కథ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశీయ కోళ్లకు మాతృక ఏది అన్నదానిపై జీవ పరిణామ సిద్ధాంత పితామహుడు చార్లెస్‌ డార్విన్‌ 1880ల్లోనే వివరణాత్మక కథ చెప్పాడు. భూమిమీద ఏ మూలన అయినా మనిషి పెంచుకుంటున్న ఏ జాతి కోడికైనా ఎర్రరంగు అడవికోడే మాతృక అని ఆయన సిద్ధాంతీకరించారు. కున్‌మింగ్‌ పరిశోధకులు గుర్తించిన ఎర్రరంగు కోడికి డార్విన్‌ చెప్పిన కోడికి చాలా పోలికలు ఉన్నాయి. ఆసియా మొత్తంలో ఈ ఎర్రరంగు కోడి జాతులు 5 ఉన్నాయి.

2004లో కోడి జన్యుక్రమాన్ని రూపొందించిన తర్వాత కోడిజాతులపై పరిశోధనలు ఊపందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు కొన్ని వందల రకాల కోళ్ల జాతులున్నాయి. భారత్‌లో కోళ్ల జాతులపై ప్రముఖ జంతుశాస్త్రవేత్త ముఖేశ్‌ ఠాకూర్‌ చాలా ఏండ్ల క్రితమే పరిశోధన చేశారు.

‘భారత్‌లో ఒకే లక్షణాలున్న రెండు కోళ్లజాతులు సహజంగా కనిపిస్తాయి. ఇవి రెండూ ఎరుపురంగు అడవికోడి నుంచే వచ్చాయి.

కాలక్రమంలో వీటి జన్యువులు కలిసిపోయి అడవి కోడి జన్యువులు అంతర్ధానమయ్యాయి’ అని ఆయన పరిశోధన పత్రంలో వివరించారు. ప్రస్తుతం దక్షిణ, నైరుతి ఆసియాదేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే ఎర్రరంగు కోళ్లు ప్రాచీన ఎరుపురంగు అడవికోడి సంతతేనట. కాలక్రమంలో మనిషి అవసరానికి తగినంత కోడిమాంసం సృష్టించేందుకు అనేక హైబ్రిడ్‌ ప్రజాతులను సృష్టించారు. దాంతోపాటే కోడిమాంసం నాణ్యతలో కూడా మార్పులు వచ్చాయి.

Tags :
|
|
|

Advertisement