మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి సవాల్ విసిరిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు
By: chandrasekar Sat, 12 Sept 2020 09:31 AM
అధికార పార్టీలోని రెబల్
ఎంపీగా పేరుగాంచిన రఘురామకృష్ణంరాజు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి సవాల్
విసిరారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ పార్టీకి మరియు రెబల్ ఎంపీ
రఘురామకృష్ణంరాజుకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రఘురామకృష్ణంరాజుకు
దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే ఏపీలో జరుగుతున్న
కార్యక్రమాలపై రఘురామకృష్ణంరాజు విమర్శలు గుప్పిస్తున్నారు.
సొంత పార్టీనే
విమర్శించడం వల్ల తాజాగా తనను రాజీనామా చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
కోరడంపై రఘురామ కృష్ణరాజు ప్రతి సవాల్ విసిరారు. తమ పార్టీకి చెడ్డ పేరు రావద్దనే
అమరావతి రాజధానిగా ఉండాలని సీఎంను కోరుతున్నానని ఆయన అన్నారు. తాను రాజీనామా చేసి
నెగ్గితే అమరావతే రాజధానిగా ఉంటుందని రాసిచ్చేందుకు సీఎం జగన్ను ఒప్పిస్తారా అని
ప్రశ్నించారు.
రాజీనామా తరువాత తాను
మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే అమరావతిపై రెఫరెండంగా స్వీకరించేందుకు సీఎం
జగన్ సిద్ధమేనా అని అన్నారు. అలాగైతే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమే అని
రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఇక ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసన
తెలిపిన రఘురామకృష్ణంరాజు వాటిని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని తన
అధికారిక నివాసంలో నల్ల బ్యాడ్జి ధరించి దీక్ష చేపట్టారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో
దేవాలయాలపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఈ దాడుల పట్ల ప్రభుత్వం
ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దాడులను అరికట్టలేకపోతే మతసామరస్యం
దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. అంతర్వేది రథం దగ్ధంపై పోలీసులు నమ్మశక్యంకాని కారణాలు
చెబుతున్నారని అన్నారు. దీనిపై సిబిఐ విచారణ కోరిన సంగతి తెలిసిందే.