సురేశ్ రైనా ఇండియాకి తిరిగిరావడానికి అదే కారణం
By: Dimple Tue, 01 Sept 2020 11:53 PM
చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్... సురేశ్ రైనా ఐపీఎల్ మ్యాచులకోసం దుబాయ్ కెళ్లి... వెనువెంటనే... తిరుగుప్రయాణం కావడం చర్చనీయాంశమైంది. సూపర్కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకోవడం, యూఏఈ నుంచి స్వదేశానికి బయల్దేరడం మీద పెద్ద చర్చే నడుస్తోంది . చాలామందిలో అపోహలు నెలకొన్నాయి. దీంతో తీవ్ర విచారంలో ఉన్న సురేశ్రైనా తను ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణతో ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తంచేశారు.
దుబాయి చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్ రావడం.... ఆతర్వాత కొద్ది సేపటికే రైనా కూడా ఇండియా తిరుగుప్రయాణం కావడంతో రకరకాలుగా ఊహించుకోడానికి కారణమైంది. తాజాగా స్పందించిన రైనా అపోహలను దూరం చేసేందుకు ప్రయత్నించాడు. తన మేనత్త ఇంటిపై దోపిడీ దొంగలు దాడి చేసి ఆమె భర్తను హతమార్చిన ఉదంతమే అతను అర్ధంతరంగా స్వదేశానికి బయల్దేరడానికి కారణం అన్నారు. అయితే రైనా దుబాయ్కి బయల్దేరడానికి ముందే ఆ ఘటన జరిగింది. అప్పుడు ఆగని వాడు.. ఇప్పుడు ఎందుకు తిరిగొస్తున్నాడనే ప్రశ్న తలెత్తింది.
మరోవైపు కరోనా భయం, దుబాయ్లో దిగినప్పటి నుంచి ఒంటరిగా ఉండటం, జట్టులో పది మందికి పైగా కరోనా పాజిటివ్గా తేలడం రైనాను మానసిక ఒత్తిడిలోకి నెట్టిందని.. అందువల్లే అతను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడని మరో కథనం ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇంకో రోజు గడిచేసరికి మళ్లీ ఇంకో కథనం పుట్టుకొచ్చింది. తనకు కేటాయించిన హోటల్ గదిలో బాల్కనీ లేకపోవడంపై రైనా జట్టు యాజమాన్యంపై ఆగ్రహించాడని, బయో బబుల్ నిబంధనల్ని కూడా ఉల్లంఘించాడని.. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ ప్రతినిధులతో మాటా మాటా పెరిగి ఐపీఎల్ నుంచే తప్పుకునే వరకు పరిస్థితి వెళ్లింది అన్నది ఈ కథన సారాంశం. రైనా విషయమై ఫ్రాంఛైజీ యజమాని శ్రీనివాసన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడని, ‘‘కొన్నిసార్లు విజయం తలకెక్కుతుంది’’ అంటూ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే తన గది విషయంలో ఫ్రాంఛైజీతో రైనా గొడవ పడ్డాడనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నది జట్టు వర్గాల సమాచారం. అతడికి కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెమింగ్లతో పాటే సూట్ గది కేటాయించారని, దానికి బాల్కనీ మాత్రమే లేదని.. ఆమాత్రానికి రూ.11 కోట్ల ఒప్పందాన్ని కాదనుకుని ఐపీఎల్కు దూరమవ్వాలని రైనాకు ఎందుకు అనుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. రైనాపై తాను విమర్శలు గుప్పించినట్లు వచ్చిన వార్తల్ని స్వయంగా శ్రీనివాసన్ ఖండించడం గమనార్హం. ‘‘చెన్నై జట్టుకు ఇన్నేళ్లలో రైనా చేసిన అందించిన తోడ్పాటు అసమానమైనది. రైనా కుంగుబాటులో ఉన్న ఈ సమయంలో అతడికి ఫ్రాంఛైజీ పూర్తి అండగా ఉంటుంది. నా వ్యాఖ్యను ప్రతికూల కోణంలో తీసుకున్నారు’’ అని శ్రీనివాసన్ ఓ మీడియా సంస్థతో పేర్కొన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే మేనత్త ఇంట్లో విషాదానికి తోడు కరోనా భయం, ఒంటరిగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఎదుర్కోవడం వల్లే రైనా ఐపీఎల్కు దూరమై, స్వదేశానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.
ఆ పొట్టేలు ధర వింటే దిమ్మతిరుగతుంది
గొర్రె లేదా పొట్టేలు ధర ఎంత ఉంటుంది? రూ.వేలల్లో ఉండొచ్చు. మేలైన జాతి గొర్రెలైతే రూ.లక్షలు విలువ చేయొచ్చు. కానీ ఇటీవల వేలంలో ఓ గొర్రె ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. దీని ధరెంతో తెలుసా? అక్షరాలా రూ. 3.57 కోట్లు!!
నెదర్లాండ్స్లోని టెక్సెల్లో గొర్రెల పరిశ్రమ ఉంది. ఇక్కడి గొర్రెలకు ఉత్తమ జాతి గొర్రెలుగా పేరుంది. అయితే ఇటీవల కొత్తగా జన్యుపరంగా ఉత్తమమైన గొర్రె ‘డబుల్ డైమండ్’ను వేలంలో పెట్టారు. దీనిని సొంతం చేసుకునేందుకు యూకే వ్యాప్తంగా పాడి రైతులు పోటీ పడ్డారు.
అయితే దీని ధర మొదటి నుంచి అధికంగా ఉండటంతో ఎలాగైనా ఈ గొర్రెను దక్కించుకోవాలని వేలానికి ముందే కొందరు సంయుక్తంగా కొనాలని నిర్ణయించుకున్నారట. వేలానికి రాగానే ఓ ముగ్గురు పాడి రైతులు కలిసి అత్యధికంగా 4,90,000డాలర్లు (రూ.3,75,78,379)పెట్టి ఆ గొర్రెను సొంతం చేసుకున్నారు.
గతంలో ఇక్కడి వేలంలో అమ్ముడుపోయిన గొర్రె ధర రూ. 2.24 కోట్లేనట. ఇప్పుడు ఈ నెలల వయసున్న ‘డబుల్ డైమెండ్’ గొర్రెను తీసుకెళ్లి.. పెరిగిన తర్వాత దాని వీర్యం సేకరించి కృత్రిమ గర్భధారణతో ఈ జాతి గొర్రెలను మరిన్ని సృష్టించాలని రైతులు భావిస్తున్నారట