యూట్యూబ్లో వీడియోలు చూసి రెండు బ్యాంకులను దోచుకున్న రెడీమేడ్ బట్టల వ్యాపారి
By: chandrasekar Tue, 06 Oct 2020 09:15 AM
యూట్యూబ్లో వీడియోలు
చూసి రెడీమేడ్ బట్టల వ్యాపారి రెండు బ్యాంకులను దోచుకున్న విషయం వెలుగులోకి
వచ్చింది. యూట్యూబ్లో వీడియోలు చూసి మంచి పేరు సంపాదించుకున్న వారు ఎందరో
ఉన్నారు. అదేవిధంగా, ఆ వీడియోలను చూసి దొంగలుగా మారినవారు కూడా ఉన్నారు.
లాక్డౌన్ సమయంలో జరిగిన నష్టాలను తిరిగి పొందడానికి ఓ రెడీమేడ్ బట్టల వ్యాపారి
యూట్యూబ్ వీడియోలు చూసి రెండు బ్యాంకులను దోచుకున్నాడు. బొమ్మ తుపాకులను ఉపయోగించి
ఇతగాడు దోచుకున్న రూ.12 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకుని కటకటాల్లోకి
పంపారు. భువనేశ్వర్ నగర శివార్లలోని
తంగిబంట గ్రామానికి చెందిన సౌమ్యరంజన్ జెనా అలియాస్ తులు రెడీమేడ్ వస్త్రాలను
విక్రయిస్తుంటాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించడంతో అమ్మకాలు
పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
డబ్బులు లేక ఇబ్బంది పడడంతో దొంగతనానికి పూనుకొన్నాడు.
లాక్ డౌన్ లో ఏర్పడిన
నష్టాలను పూడ్చుకోవడానికి దొంగతనం చేయడం ఒక్కటే పరిష్కారం అని నమ్మిన
సౌమ్యరంజన్ యూట్యూబ్లో దొంగతనం చేయడం ఎలా
అనే వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాడు. బొమ్మ తుపాకీని కొనుగోలు చేసిన సౌమ్యరంజన్
గత నెల ఏడో తేదీన ఇన్ఫోసిటీకి సమీపంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, 28 తేదీన
మంచేశ్వర్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, బరిముండా బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తంలో నగదు
దోచుకున్నాడు. నిందుతుడికి రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. దాదాపు రూ.19 లక్షల
రుణం తీసుకుని వస్త్రాల వ్యాపారం చేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా వ్యాపారం నడవక
దొంగతనం చేయాలని నిర్ణయించుకుని పోలీసులకు పట్టుబడినట్లు భువనేశ్వర్-కటక్ పోలీస్
కమిషనర్ సుధాంశు సారంగి చెప్పారు. నిందితుడి నుంచి రూ.12 లక్షల
నగదుతోపాటు బొమ్మ తుపాకీ, ఒక బైకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు
తెలిపారు. కరోనా చాలా మంది జీవితాలతో ఈ రకంగా కూడా ఆడుకుంటావుంది.