ఐపీఎల్ 2020 సీజన్లో RCB శుభారంభం
By: chandrasekar Tue, 22 Sept 2020 01:46 AM
ఐపీఎల్ 2020 సీజన్లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్తో దుబాయ్
వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో సత్తాచాటిన
బెంగళూరు 10 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మ్యాచ్లో
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఏబీ డివిలియర్స్ (51: 30 బంతుల్లో 4x4, 2x6), దేవదూత్ పడిక్కల్ (56: 42 బంతుల్లో 8x4) హాఫ్
సెంచరీలు బాదడంతో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనలో ఓపెనర్
జానీ బెయిర్స్టో (61: 43 బంతుల్లో 6x4,
2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ అలవోక విజయాన్ని
అందుకునేలా కనిపించింది. కానీ జట్టు స్కోరు 121 వద్ద బెయిర్స్టో ఔటవగా ఆ తర్వాత వరుసగా వికెట్లు
చేజార్చుకున్న హైదరాబాద్ 19.4 ఓవర్లలో 153 పరుగులకి ఆలౌటైంది. ఛేదన ఆరంభంలోనే హైదరాబాద్
కెప్టెన్ డేవిడ్ వార్నర్ (6: 6 బంతుల్లో 1x4)
అనూహ్యరీతిలో రనౌటవగా అనంతరం వచ్చిన మనీశ్ పాండే (34: 33 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి జానీ బెయిర్స్టో దూకుడుగా ఆడాడు. దాంతో 15.1
ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ 121/2తో మెరుగైన స్థితిలో నిలిచింది.
కానీ ఇన్నింగ్స్ 16వ ఓవర్
వేసిన చాహల్ వరుస బంతుల్లో బెయిర్స్టోతో పాటు విజయ్ శంకర్ (0)లను
క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం వచ్చిన
అభిషేక్ శర్మ (7), రషీద్ ఖాన్ (6),
భువనేశ్వర్ కుమార్ (0), సందీప్ శర్మ (9), మిచెల్
మార్ష్ (0) సింగిల్
డిజిట్స్కే ఔటైపోయారు. పేకమేడని తలపిస్తూ ఆఖర్లో కేవలం 32
పరుగుల వ్యవధిలోనే సన్రైజర్స్ 8 వికెట్లు చేజార్చుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
బెంగళూరు బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు పడగొట్టగా శివమ్ దూబే, నవదీప్
సైనీ చెరో రెండు, డేల్ స్టెయిన్ ఒక వికెట్ తీశాడు.