శ్రీవేంకటేశ్వరునికి వారి దర్శనం ఆపాలని కోరుతున్న రమణ దీక్షితులు
By: chandrasekar Sat, 18 July 2020 7:25 PM
టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన
అర్చకులు ఏవీ రమణదీక్షితులు కొద్దిరోజుల నుంచి తన ట్వీట్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం, టీటీడీకి
ఇబ్బందికరమైన పరిణామాలు సృష్టిస్తున్నసంగతి తెలిసిందే. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా
మారింది. శ్రీవారి ఆలయంలో పనిచేసే అర్చకుల స్థానంలో వేరొకరిని తీసుకురాలేమని
వ్యాఖ్యానించిన రమణ దీక్షితులు శ్రీవేంకటేశ్వరునికి నిత్య ఆరాధనలు ఆపితే మానవ
జాతికి మంచిది కాదని అన్నారు. కొన్ని వారాలపాటు స్వామి వారి దర్శనం ఆపాలని
కోరుతున్నట్టు ఆయన తెలిపారు.
దర్శనాలు నిలిపి పూజలు
ఏకాంతంగా నిర్వహించడం ద్వారా అర్చకులకు రక్షించిన వారు అవుతామని రమణ దీక్షితులు
అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ట్వీటర్ ద్వారా
తన సూచనలను అందించారు. ఇక రమణ దీక్షితులు గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై నిన్న
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. రమణ దీక్షితులు గౌరవ ప్రధాన
అర్చకుల హోదాలో ఉండి ట్విటర్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని వైవీ
సుబ్బారెడ్డి సూచించారు.
బోర్డుకు సలహాలు ఇవ్వాలే
కానీ మీడియాలో వ్యాఖ్యలు చేయడం రమణ దీక్షితులకు సబబు కాదని తెలిపారు. ఏవరైనా సరే
టిటిడి విషయంలో, దర్శన విధి విధానాల విషయంలో రాజకీయ రంగులు పులమొద్దని
ఆయన హెచ్చరించారు. టీటీడీలో ఇప్పటి వరకు 140 కేసులు నమోదు అయ్యాయని టీటీడీ ఛైర్మన్ వైవీ
సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో అధికారులతో, అర్చకులతో
అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన తిరుమలలో అధిక శాతం ఏపీఎస్పీలో పని చేసే
సెక్యురిటి సిబ్బందికి, పోటు కార్మికులకే కరోనా నిర్ధారణ అయిందని వివరించారు.
వీరిలో 70 మంది
వరకు కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. వారిలో కొందరు హోమ్ క్వారంటైన్లో
ఉన్నారని వివరించారు. మరికొందరు డ్యూటీలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం
చికిత్స పొందుతున్న 70 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైవీ సుబ్బారెడ్డి
అందులో ఒక్కరు మాత్రమే ఐసియులో చికిత్స పొందుతున్నారని వివరించారు.