సందడి లేకుండా రంజాన్ వేడుకలు
By: chandrasekar Mon, 25 May 2020 11:39 AM
ఇటీవలి కాలంలో ఎన్నడూ
లేని రీతిలో ముస్లింలు రంజాన్ పర్వదినాన ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. పండుగ
రోజున సామూహిక ప్రార్థనలు నిర్వహించి.. ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకునే
ముస్లింలు.. కరోనా మహమ్మారి కారణంగా ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాల్సి
వచ్చింది.
హైదరాబాద్ నగరంలో రంజాన్
పర్వదినాన సందడి లేకుండా పోయింది. అప్పుడెప్పుడో 112 ఏళ్ల క్రితం మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఇలాంటి
పరిస్థితి తలెత్తింది. అప్పట్లో మసీదులు తెరిచి ఉంచినప్పటికీ.. ఇళ్లలోనే
ప్రార్థనలు చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు కోవిడ్ విజృంభణతో ఇళ్లలోనే ఈద్-ఉల్-ఫితర్
జరుపుకొంటున్నారు. 1908
సెప్టెంబర్ సెప్టెంబర్లో మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయి. కుండపోత వర్షానికి
భారీగా ప్రాణ నష్టం సంభవించింది. వరద తీవ్రతకు మూసీ నదిపై ఉన్న 3 వంతెనలు సైతం తెగిపోయాయి. 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు
కూలిపోవడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలోనే రంజాన్ మాసం ప్రారంభం కాగా
హైదరాబాదీలో పండుగను నిరాడంబరంగా జరుపుకొన్నారు.
కోవిడ్ కారణంగా ఇన్నేళ్ల
తర్వాత పండుగ మక్కా మసీదు ముందు వేలాది మంది ప్రార్థనలు నిర్వహించకుండానే రంజాన్
పండుగను జరుపుకోవాల్సి వచ్చింది. రంజాన్ సీజన్లో కిటకిటలాడే చార్మినార్ పరిసర
ప్రాంతాలు బోసిపోయాయి. ఈ సీజన్లో రూ.500 కోట్ల
వ్యాపారం జరిగేది. కానీ ఈసారి లాక్డౌన్ దెబ్బకు మార్కెట్లో అమ్మకాలు పడిపోయాయి.
కరోనా ప్రభావం పండుగ మీదే కాకుండా ఈ సీజన్లో అమ్మకాలపై ఆశలు పెట్టుకున్న
వ్యాపారులు, దుకాణాల్లో
పని చేసే వారిపై ప్రభావం చూపింది.