సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన 44 కీలక వంతెనలను ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్
By: chandrasekar Tue, 13 Oct 2020 2:44 PM
ఒక ప్రణాళిక ప్రకారం
భారత్, పాక్
సరిహద్దులో కుట్రలు జరుగుతున్నాయని రక్షణ
శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మొదట పాకిస్థాన్, ఇప్పుడు
చైనా సరిహద్దులో వివాదం సృష్టిస్తున్నాయని తెలిపారు. తాజాగా నెలకొన్న ఉద్రిక్త
పరిస్థితులు చూస్తుంటే ఒక మిషన్లో భాగంగానే ఈ రెండు దేశాలు వివాదం
సృష్టిస్తోన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సరిహద్దులో చైనా కుట్రలను
తిప్పి కొడుతూనే భారత దళాలను సర్వసన్నద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో
భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన 44 కీలక వంతెనలను రక్షణ మంత్రి రాజ్నాథ్ అక్టోబర్ 12 న ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన
ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సరిహద్దులో ఉద్రిక్తతలపై స్పందించారు. ‘తూర్పు నుంచి
పడమర వరకు ఇరు దేశాలతో (పాకిస్థాన్, చైనా) భారత్కు దాదాపు 7000
కి.మీ. సరిహద్దు ఉంది. ఇప్పటికీ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
మొదట్లో పాకిస్థాన్, ఇప్పుడు చైనా దేశాలు ఒక మిషన్లో భాగంగా ఈ వివాదాలు
సృష్టిస్తోన్నట్లు కనిపిస్తోంది’ అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రధాని
నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇలాంటి సంక్షోభాలను దీటుగా ఎదుర్కోవడమే కాదు, కీలకమైన, చరిత్రాత్మక
మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
లాక్డౌన్
కొనసాగుతున్నప్పటికీ అవిశ్రాంతంగా పనిచేసి నిర్మాణ పనులు పూర్తి చేసిన బోర్డర్
రోడ్స్ ఆర్గనైజేషన్ ను ఆయన
అభినందించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గత రెండేళ్లలోనే కొండ ప్రాంతాల్లో దాదాపు
2200
కిలోమీటర్లకు పైగా రహదారులను బీఆర్ఓ నిర్మించిందని ఈ సందర్భంగా రక్షణ మంత్రి
గుర్తు చేశారు. వీటితో పాటు మరో 4200 కి.మీ ఉపరితల రోడ్డు మార్గాలను బీఆర్ఓ
నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు మంచుకొండలతో నిండి ఉండే హిమాచల్
ప్రదేశ్లోని డార్చా ప్రాంతాన్ని లడఖ్తో అనుసంధానించే ప్రాజెక్టు పనులు కూడా
వేగంగా జరుగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన 44
బ్రిడ్జిలను రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. లడఖ్, కశ్మీర్, అరుణాచల్
ప్రదేశ్, సిక్కిం, హిమాచల్
ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లోని
పలు ప్రాంతాల్లో ఈ వంతెనలు ఉన్నాయి. పైగా ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న లడఖ్లోని
వ్యూహాత్మక ప్రాంతాల్లోనే 7 వంతెనలు ఉండటం గమనార్హం. కీలక ప్రాంతాల్లో నిర్మించిన ఈ వంతెనలు బలగాలు, ఆయుధాలు, వస్తువుల
తరలింపును మరింత సులభతరం చేయనున్నాయి. చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు
నెలకొన్న సమయంలోనే ఈ వంతెనలు పూర్తికావడం చర్చనీయాంశంగా మారింది.