కేంద్ర మంత్రితోపాటు మరో ఇద్దరిపై రాజస్థాన్ పోలీసులు కేసు
By: chandrasekar Tue, 21 July 2020 12:48 PM
కేంద్ర మంత్రి గజేంద్ర
సింగ్ షెకావత్ రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేల
కొనుగోలుకు బీజేపీ నేతలు బేరసారాలకు పాల్పడినట్టు ఆడియో టేపులు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ
వ్యవహారంలో కేంద్ర మంత్రితోపాటు మరో ఇద్దరిపై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదుచేసి, వ్యాపారవేత్త
సంజయ్ జైన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రికి పోలీసులు
నోటీసులు జారీచేశారు.
ఆడియో టేపుల వ్యవహారంలో
విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఆడియో టేపులు నకిలీవని, తనకు
ఎలాంటి సంబంధం లేదంటూ కేంద్ర మంత్రి తోసిపుచ్చిన విషయం తెలిసిందే. పోలీసులు తనకు
నోటీసులు జారీచేసిన విషయాన్ని షెకావత్ ధ్రువీకరించారు. వాయిస్ శాంపిల్స్తో పాటు
వాంగ్మూలం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. అయితే, దీని కంటే ముందు ఆడియో క్లిప్ ఎలా వచ్చిందో తొలుత
పోలీసులు తేల్చాలి. ఈ టేపుల మూలాలు ఎక్కడివి. ప్రభుత్వం ఈ ఆడియో క్లిప్పులను
రికార్డు చేసిందా? లేదా? అనేది తేల్చాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత
వ్యవహారాన్ని తమపై నెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. ఈ
వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు, ఆడియో
టేపుల వ్యవహారంలో నివేదిక సమర్పించాలని రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని
కేంద్ర హోం శాఖ ఆదేశించింది. మరోవైపు, ఆడియో టేపుల వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు
చేపట్టాలని పోలీసులను సీఎం అశోక్ గెహ్లాట్ ఆదేశించారు.