రైనాకు అక్కడ నిబంధనలపై అవగాహాన లేదు ..అరెస్ట్ పై స్పందించిన రైనా టీం
By: Sankar Tue, 22 Dec 2020 9:44 PM
భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సోమవారం అర్ధరాత్రి ముంబయిలో అరెస్టవడం క్రికెట్ వర్గాల్లో కలకలంరేపింది. ఎయిర్పోర్ట్ సమీపంలోని డ్రాగన్ప్లై క్లబ్లో రైనా, సింగర్ గురు రంధవాతో పాటు మొత్తం 34 మందిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.సురేశ్ రైనా అరెస్ట్పై అతని పర్సనల్ టీమ్ స్పందించింది.
‘‘సురేశ్ రైనా ఓ షూటింగ్ కోసం ముంబయికి వెళ్లాడు. అయితే.. ఆ షూట్ లేటుగా ముగిసింది. లేకుంటే వెంటనే విమానంలో ఢిల్లీకి వచ్చేసేవాడు. అదే సమయంలో ఒక స్నేహితుడు డిన్నర్ కోసం ఆ క్లబ్లోకి రైనాని ఆహ్వానించాడు. రైనాకి అక్కడి టైమింగ్స్, కొత్త నిబంధనల గురించి తెలియదు.
రూల్స్ తెలిసిన తర్వాత వేగంగా అక్కడి నుంచి వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఇంతలోనే ఆ సంఘటన జరిగిపోయింది. రైనా ఎప్పుడూ ప్రభుత్వ నియమ నిబంధనలకి లోబడే నడుచుకుంటాడు’’ అని ఓ ప్రకటనని టీమ్ విడుదల చేసింది.