ఇప్పట్లో సాధారణ రైలు సర్వీసులు లేనట్లే ...రైల్వే బోర్డు స్పష్టం
By: Sankar Fri, 26 June 2020 3:08 PM
రెగ్యులర్ టైమ్ టేబుల్డ్ రైళ్ల సేవలను ఇప్పట్లో తిరిగి ప్రారంభించే ఆలోచన లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఆగస్టు 12 వరకు అన్ని రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు అన్ని రైల్వే జోన్లకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి కోసం బుక్ చేసుకున్న అడ్వాన్స్డ్ టికెట్లకు పూర్తి స్థాయిలో రీఫండ్ చేస్తామని వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 21కు ముందు అన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
వీటి కోసం జూన్ 30 వరకు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి స్థాయి రీఫండ్ చేస్తామని ప్రకటించింది. సాధారణంగా 120 రోజులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లన్నింటినీ అప్పట్లోనే రద్దు చేసింది. ప్రయాణికులకు ఆన్లైన్ ఖాతాల్లో డబ్బును జమ చేసింది. తాజాగా జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు బుకింగ్ చేసుకున్న టికెట్లను కూడా రద్దు చేస్తున్నామని, వాటికి పూర్తి స్థాయి రీఫండ్ చేయనున్నామని ప్రకటించింది.
కాగా, వలస కూలీల తరలింపు కోసం వివిధ రాష్ట్రాల నుంచి రైల్వే శాఖ శ్రామిక్ రైళ్లను నడుపుతోంది. వీటితో పాటు దేశ వ్యాప్తంగా 230 ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. వీటిలో స్పెషల్ రాజధాని, స్పెషల్ మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లున్నాయి. 230 రైళ్లలో 9 తెలంగాణ మీదుగా వెళుతున్నాయి. వీటిని యథాతథంగా కొనసాగించనున్నట్లు బోర్డు వెల్లడించింది. కానీ, రెగ్యులర్ టైమ్ టేబుల్డ్ రైళ్లు మాత్రం ఆగస్టు 12 వరకు ప్రారం భం కావు.