సచిన్ ను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన రాహుల్
By: Sankar Wed, 15 July 2020 6:38 PM
రాజస్ధాన్లో అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ సంక్షోభం తీవ్రతరమైంది. పైలట్ను బుజ్జగించేందుకు చిట్టచివరి ప్రయత్నంగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. పైలట్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడేనని, ఆయనకు పార్టీ తలుపులు తెరిచే ఉంటాయనే సందేశాన్ని అసంతృప్త నేతకు రాహుల్ చేరవేశారు. గహ్లోత్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ సచిన్ పైలట్ను పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి తొలగిస్తూ సీఎల్పీ భేటీలో తీర్మానం చేసిన అనంతరం పైలట్ను మళ్లీ పార్టీ గూటికి చేర్చేలా రాహుల్ ప్రయత్నిస్తున్నారు.
పైలట్ డిమాండ్లను పరిష్కరించేందుకు రాహుల్, సోనియాలు చొరవ చూపడం లేదని రెబెల్ నేత వర్గీయులు పేర్కొంటున్న క్రమంలో సంక్షోభ పరిష్కారానికి రాహుల్ ఆసక్తి చూపినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సచిన్ పైలట్ను బుజ్జగించేందుకే ఆయనపై ఎలాంటి విమర్శలకూ దిగరాదని సీఎం గహ్లోత్కు అధిష్టానం సూచించింది. పైలట్పై బహిరంగ ప్రకటనలు చేయడం పట్ల గహ్లోత్ తీరుపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు చెబుతున్నారు.
సచిన్ పైలట్ శిబిరం వాదన వినేందుకు హైకమాండ్ సిద్ధంగా ఉందని రణ్దీప్ సుర్జీవాలా, కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నేతలు పేర్కొన్నారు. మరి రాహుల్ జోక్యంతో అయినా సచిన్ పైలట్ మెత్తబడతారా అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు తాను బీజేపీకి దగ్గరయ్యే ప్రసక్తి లేదని పైలట్ చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో ఆశలు రేపుతున్నాయి.