రాజకీయాలను , వినోదాన్ని కలపకండి ..మురళి బయోపిక్ పై రాధిక కామెంట్స్
By: Sankar Fri, 16 Oct 2020 9:12 PM
హీరో విజయ్ సేతుపతి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’లో నటించవద్దంటూ నిరసనలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నటి రాధిక శరత్కుమార్ విజయ్ సేతుపతికి మద్దతుగా నిలిచారు. నమ్మక ద్రోహి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న చిత్రంలో నటించొద్దని విజయ్ సేతుపతికి దర్శకుడు భారతీరాజా సూచించిన విషయం తెలిసిందే.
అంతేగాక పలు తమిళ సంఘాలు కూడా దేశద్రోహి సినిమాలో నటించవద్దంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రాధిక శుక్రవారం వరుస ట్వీట్లు చేస్తూ విజయ్ సేతుపతికి, చిత్ర పరిశ్రమకు సంఘీభావం తెలిపారు. రాజకీయాలను, వినోదాన్ని కలపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాధిక ట్వీట్ చేస్తూ.. ‘జనాలకు ఏం పని లేదా.. ఒక నటుడిని, క్రికెటర్ను కలపడం అర్థం లేని వివాదం. ముత్తయ్య మురళీధరన్ను కోచ్గా నియమించిన ఐపీఎల్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ను ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదు’ అన్నారు. అలాగే ‘‘సన్రైజర్స్, సన్ టెలివిజన్ ఛానెల్కు బలమైన రాజకీయ అనుబంధం ఉంది. అయినప్పటికి రాజకీయాలను, క్రికెట్ను, వినోదాన్ని వృత్తిపరంగా తగిన మార్గంలో స్ఫష్టంగా నిర్వహిస్తోంది. అలాంటప్పుడు రాజకీయాలకు దూరంగా చిత్ర పరిశ్రమను, వినోదాన్నేందుకు చూడకూడదు’’ అని ప్రశ్నించారు.
అయితే తను ఈ విషయాన్ని వివాదం చేయాలనుకోవడం లేదన్నారు. కేవలం సినీ పరిశ్రమకు, నటులకు న్యాయపరమైన మద్దతునిచ్చే ప్రయత్నంలో తటస్థతకు, పక్షపాతరహితానికి సాక్ష్యం ఇచ్చేందుకే సన్రైజర్స్ పేరును వాడాను అంటూ రాధిక మరో ట్వీట్లో స్పష్టం చేశారు