క్వారంటైన్ పూర్తి... ప్రాక్టీస్ షురూ
By: Dimple Sat, 29 Aug 2020 11:53 PM
కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు తమ కిట్లతో నెట్ సెషన్ ప్రాక్టీస్ చేశారు. దిగ్గజ ఆటగాళ్లు డేవిడ్ హస్సీ ఛీప్ మెంటర్గా... న్యూజిలాండ్ సీనియర్ బ్యాటింగ్ విధ్వంసకారుడు బ్రెండన్ మెకల్లమ్ బ్యాటింగ్ కోచ్గా... కైల్ మిల్స్ బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్ సారధ్యంలో బరిలో దిగుతున్న కోల్కతా నైట్ రైడర్స్... జట్టులో బ్యాటింగ్ విధ్వంసకారులు, అత్యుత్తమ బౌలర్లు, ఆల్ రౌండర్లతో సంసిద్ధంగా ఉందని బౌలింగ్ కోచ్ ఖైల్ మిల్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. జట్టులో ఏలోపం లేకుండా... బ్యాటింగ్ తో సమానంగా బౌలింగ్దళం సమకూరిందని పేర్కొన్నారు. బ్రెండెన్ మెక్కల్లమ్ సారథ్యంలో తక్కువసమయంలోనే బ్యాటింగ్ దళం మెలకువలతో రాటుదేలుతుంది. ఐపీఎల్ మ్యాచుల్లో సత్తాచాటాలని.... ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్లతో కలిసి ఇన్నింగ్స్ ఆడాలనే ఆతృత టామ్ బాన్ టన్లో వ్యక్తమవుతోంది. నెట్ సెషన్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆటగాళ్లు ఉక్కపోతతో అలసిపోయారు.
ముంబయి ఇండియన్స్, ఆటగాళ్లు అబుదాబిలోని జావేద్ క్రికెట్ స్టేడియం గ్రౌండ్లో ప్రాక్టీస్ సెషన్ లో చురుగ్గా కన్పించారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాళ్లు అందరూ ఆనందకర వాతావరణంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే... జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్ వ్యాయామం చేస్తూ... బౌలింగ్ సాధన చేశారు. కృనాల్ పాండ్యా, హార్థిక్ పాండ్యా మైదానంలో కసరత్తు మొదలుపెట్టారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.. ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు... మైదానంలో బౌతిక దూరాన్నిపాటిస్తూ... పరుగులు చేస్తూ... వార్మప్ సెషన్లో కన్పించారు. బౌలర్ నాథన్ కట్లర్, మిచెల్ మెక్లెగనన్, దవళ్ కులకర్ణి హుషారుగా ప్రాక్టీస్ సెషన్లో పాలుపంచుకున్నారు.
ఇక దుబాయ్ లో ఉంటున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు ఔట్డోర్లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సన్రైజర్స్ మెంటార్, టీమ్ఇండియా మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ సీజన్లో తమ జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లను పరిచయం చేశాడు. అందులో హైదరాబాద్కు చెందిన సందీప్ భవనక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తొలుత లక్ష్మణ్ మాట్లాడుతూ ఎస్ఆర్హెచ్ అంటే ఫ్రాంఛైజీ కాదని, ఒక కుటుంబమని చెప్పాడు. అనంతరం ఆటగాళ్లందరికీ స్వాగతం పలికాడు. అలాగే జట్టులోని ప్రతీ ఒక్కరూ ఈ మెగా టోర్నీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. ఆటగాళ్లంతా ప్రతీ ఒక్కరితో స్నేహంగా ఉండాలని సూచించారు.
జమ్మూ కశ్మీర్ నుంచి అబ్దుల్ సమద్ , హైదరాబాద్ నుంచి సందీప్ భవనక , ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రియమ్ గార్గ్ తదితర యువ ఆటగాళ్లు తమను తాము పరిచయంచేసుకున్నారు. బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రశాంత వాతావరణంలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
ఐపీఎల్కు సన్నద్ధమయ్యేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు తొలిసారి కలిసికట్టుగా మైదానంలోకి దిగారు. జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్ జరిగింది. ఆరు రోజుల కనీస క్వారంటీన్ సమయం ముగియడంతో ఆర్సీబీ సభ్యులంతా సాధన చేశారు. ఉదయం సరదాగా నగరంలో తిరిగొచ్చిన ఆటగాళ్లు సాయంత్రం నెట్స్లో శ్రమించారు. యూఏఈ బయల్దేరడానికి ముందు బెంగళూరు టీమ్ ఎలాంటి సన్నాహకాల్లో పాల్గొనలేదు. ఆ జట్టు సభ్యుల్లో దాదాపు ప్రతీ ఒక్కరు వేర్వేరు సమయాల్లో విడిగా వచ్చి సహచరులతో చేరారు. టీమ్ డైరెక్టర్ మైక్ హసన్ మొదటి సెషన్ను పర్యవేక్షించారు.
రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తమ ఆటగాళ్లతో ఆనందంగా ఐసీసీ అకాడెమీ గ్రౌండ్స్లో ప్రాక్టీస్చేశాయి. బ్యాటింగ్, బౌలింగ్, క్యాచెస్, ఫీల్డింగ్ ప్రాక్టీస్లో అన్ని జట్లకంటే ముందుగా దూసుకెళ్తున్నాయి.