Advertisement

లాభపడ్డ దేశీయ స్టాక్‌ మార్కెట్లు

By: chandrasekar Wed, 24 June 2020 6:35 PM

లాభపడ్డ దేశీయ స్టాక్‌ మార్కెట్లు


దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ సూచీలు దూసుకుపోతున్నాయి. గతవారంలో భారీగా లాభపడ్డ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ వారం ప్రారంభం నుంచి లాభాలబాట పట్టింది. మధ్యాహ్నం వరకు 500 పాయింట్ల స్థాయిలో కదలాడిన సూచీకి భారత్‌-చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో చివరి గంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 482 పాయింట్ల స్థాయిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు 179.59 పాయింట్లు లాభపడి 34,911.32 వద్ద నిలిచింది.

జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ సైతం 66.80 పాయింట్లు అందుకొని 10,311.20 వద్ద స్థిరపడింది. మార్చి 11 తర్వాత సూచీలకు ఇదే గరిష్ఠ స్థాయి. కోవిడ్‌-19 ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పలు ఫార్మా సంస్థలు ప్రకటించడంతో ఈ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. కానీ, భారత్‌-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నట్లు వచ్చిన వార్తలు మదుపరుల్లో ఆందోళనను పెంచాయి. ఫలితంగా చివరి గంటలో అమ్మకాలకు మొగ్గుచూపడంతో ప్రారంభ గరిష్ఠ స్థాయి లాభాలను నిలబెట్టుకోలేకపోయింది.

బజాజ్‌ ఆటో 7 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ల షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు నష్టపోయాయి. ఆర్‌ఐఎల్‌ దూకుడు రిలయన్స్‌ ప్రభంజనం కొనసాగుతున్నది. ఒక దశలో కంపెనీ మార్కెట్‌ విలువ 150 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. ప్రారంభంలో కంపెనీ షేరు ధర అమాంతం పెరుగడంతో సంస్థ విలువ రూ.28,248.97 కోట్లు పెరిగి రూ.11,43,667 కోట్ల (150 బిలియన్‌ డాలర్ల)కు చేరింది. కానీ, చివరకు ఇంతటి స్థాయి లాభాలను నిలబెట్టుకోలేకపోవడంతో మార్కెట్‌ విలువ రూ.11,07,620.56 కోట్ల్ల (145.68 బిలియన్‌ డాలర్లు)కు పరిమితమైంది. ఇంట్రాడేలో 2.53 శాతం లాభపడి రికార్డు స్థాయి రూ.1,804.10కి చేరుకున్న కంపెనీ షేరు ధర చివరకు 0.70 శాతం నష్టంతో రూ.1,747.20 వద్ద నిలిచింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ నష్టపోయింది.

Tags :
|

Advertisement