సినిమా టిక్కెట్ల ధరను రూ.50 నుంచి రూ.250 వరకు నిర్ణయించుకునేందుకు నిర్మాతలకు అధికారం
By: chandrasekar Tue, 24 Nov 2020 10:51 AM
కరోనా వల్ల సినిమా
పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా
గడిచిన ఎనిమిది నెలలుగా సినీ పరిశ్రమ నిలిచిపోయింది. దీని వల్ల కొన్ని వేల మంది
సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. అంతేకాదు, సినిమా థియేటర్లు సైతం 8
నెలలుగా మూతబడటంతో థియేటర్ల యజమానులు, వాటిలో పనిచేసే కార్మికులు సైతం నష్టపోయారు. సినీ
పరిశ్రమకు జరిగిన నష్టాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం దానికి అండగా
నిలిచేందుకు నడుం బిగించింది. దీనిలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం కొన్ని
వరాలు ఇచ్చారు. 40 వేల మంది సినీ కార్మికులకు సామాన్య ప్రజల మాదిరిగానే
హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు, ఇతర సదుపాయాలు అందజేస్తామని అన్నారు. అలాగే, సినిమా
థియేటర్లు తెరుచుకునేంత వరకు కనీస డిమాండ్ ఛార్జీలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
అంతేకాదు, రూ.10 కోట్ల
కన్నా తక్కువ బడ్జెట్తో రూపొందిన సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ 9
శాతాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది.
కానీ ప్రస్తుతం సినిమా
షోల సంఖ్య పెంచుకోవడానికి టిక్కెట్ ధరలను సవరించుకోవడానికి అనుమతి ఇవ్వడం ఇప్పుడు
చర్చనీయాంశమైంది. నిజానికి కేసీఆర్ కురిపించిన వరాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
సహా సినీ ప్రముఖులంతా ట్వీట్లు చేశారు. ఇక తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి
ధన్యవాదాలు తెలియచేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అధ్యక్షుడు సి.కళ్యాణ్
పేరిట విడుదలైన ఈ ప్రెస్ నోట్లో చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్
ఇచ్చినందుకు, థియేటర్లు ఇష్ట ప్రకారం షోలు పెంచుకునేందుకు, సినిమా
టిక్కెట్ల ధరను రూ.50 నుంచి రూ.250 వరకు నిర్ణయించుకునేందుకు నిర్మాతలకు అధికారం
ఇచ్చినందుకు సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చినందుకు
ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
అంటే నిర్మాతల మండలి అప్పుడే టిక్కెట్ ధరల సవరింపు రేట్లను ఫిక్స్ చేసింది.
ఇకపై పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు టిక్కెట్ ధరలకు రెక్కలు రానున్నాయి.
అసలు మల్టీప్లెక్సుల్లో
టిక్కెట్ ధరలు రూ.150 నుంచి ప్రారంభమవుతున్నాయి. అక్కడంతా ఒకటే క్లాస్.
మల్టీప్లెక్సుల్లో టిక్కెట్ ధరలను రూ.250 వరకు పెంచుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే
అక్కడ సినిమా చూడాలని అనుకునేవారు ఒక వంద ఎక్కువ పెట్టయినా టిక్కెట్ కొంటారు. కానీ, సాధారణ
థియేటర్లల దగ్గరికి వచ్చే సరికి ఆ లెక్కలు మారతాయి. సింగిల్ థియేటర్లలో మూడు
క్లాసులుంటాయి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ టిక్కెట్ ధర రూ.130 వరకు ఉంది. ఇప్పుడు ఈ
ధరలు అమాంతం పెరిగితే సామాన్యులపై అధిక భారం పడినట్టే. ముఖ్యంగా బీ, సీ
సెంటర్లలో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. రూ.100 టిక్కెట్ను రూ.250కి కొనుగోలు చేయాలంటే ప్రేక్షకులు కాస్త ఆలోచిస్తారు.
రూ.50
టిక్కెట్ కొనేవారు రూ.250 అంటే దాని జోలికి కూడా పోరు. మరి ఇది ఎలా వర్కౌట్
అవుతుందో చూడాలి. దీనివల్ల మొదటికే మోసం రావచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.