కళ్ళు బైర్లు కమ్మిస్తున్న కరోనా టెస్ట్ ధరలు ..
By: Sankar Fri, 07 Aug 2020 10:08 AM
కరోనా మహమ్మారి వలన ప్రజల్లో ఉన్న భయాన్ని ప్రైవేట్ ఆసుపత్రులు బాగా సొమ్ముచేసుకుంటున్నాయి ..ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.2,200 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, దానికి రెట్టింపునకు మించి మరి వసూలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కరోనా అనుమానిత లక్షణాలున్న వారు గగ్గోలు పెడుతున్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.2,200తో పాటు కొన్ని చోట్ల వచ్చిన వ్యక్తికి ఒక పీపీఈ కిట్ వేస్తున్నారు. శాంపిల్ తీసే వ్యక్తి కూడా మరోటి వేసుకుంటున్నాడు. ఈ రెండిం టికి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం పీపీఈ కిట్ ధర రూ.300కు మించి లేదు. కానీ ఒక్కో పీపీఈ కిట్కు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్లయితే సాధారణ మాస్క్ కాకుండా, తప్పనిసరిగా ఎన్–95 మాస్క్ ధరించాల్సిందేనని ఇచ్చి, దానికి కూడా రూ. 300 వసూలు చేస్తున్నా రు. ఇలా అవకాశమున్నంత మేరకు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు..
రాష్ట్రంలో 23 ఆసుపత్రులు, ల్యాబ్ల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టెస్టుల్లో జరుగుతున్న దోపిడీ.. కిట్ తీసుకుంటేనే టెస్ట్.. అనవసర సీటీ స్కాన్లపై వైద్య, ఆరోగ్య శాఖ సీరియస్గా ఉంది. దీనిపై గురువారం అధికారులు చర్చించారు. ఇలా ఇష్టారాజ్యంగా టెస్టులకు వసూళ్లు చేస్తున్న ఆసుపత్రులు, ల్యాబ్లపైనా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నారు.
మొదట్లో టెస్టులు సక్రమంగా చేయకపోవడం, శాంపిళ్ల సేకరణలోనూ లోపాలు వంటి వాటిపై 12 లేబొరేటరీలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వేటిపైనా చర్యలు తీసుకోలేదు. దీన్నే అలుసుగా తీసుకొని కొన్ని ఆసుపత్రులు, లేబొరేటరీలు టెస్టులకు అధికంగా వసూలు చేస్తుండటంపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి