నా నిర్లక్ష్యపు ఆటతీరుతో జట్టుకు నష్టం కలిగించకూడదు అనుకున్నాను ..పృథ్వీ షా
By: Sankar Sat, 26 Sept 2020 2:53 PM
ఈ ఏడాది ఐపీయల్ లో పటిష్ట జట్లలో ఒకటిగా భావిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది..రెండో మ్యాచ్ లో అత్యంత పటిష్ట జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ పై అన్ని విబిగాలలో పైచేయి సాధించింది..ఈ మ్యాచ్ లో బ్యాటింగ్లో యువ ఆటగాడు పృథ్వీ షా రాణించి అర్థ సెంచరీ చేసి మాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు..తన ఇన్నింగ్స్ పై మ్యాచ్ అనంతరం పృథ్వీ షా స్పందించాడు.
నేను నా సహజమైన ఆటతీరునే ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకోసం మైదానం నలువైపులా షాట్లు ఆడేందుకు ప్రయత్నించా. గత మ్యాచ్లో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకూడదని అనుకున్నా. నా నిర్లక్ష్య ఆటతీరుతో జట్టుకు నష్టం కలిగించకూడదు. సీఎస్కే బౌలర్ల నుంచి కొన్ని బంతులు వచ్చాయి. పిచ్ పరిస్థితిని అర్థం చేసుకొని బ్యాటింగ్ కొనసాగించా. శిఖర్ ధావన్ ఒక అనుభవజ్ఞుడిగా నా ఇన్నింగ్స్కు మంచి సహకారమందించాడు. జట్టు స్కోరు 40 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్పిన్నర్లు వచ్చినా అప్పటికే పేస్ను సమర్థంగా ఎదుర్కొన్నాం కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు.' అని తెలిపాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. ' ఒక కెప్టెన్గా ఈ విజయాలను ఆస్వాధిస్తున్నా. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలవడం మా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇప్పుడు మేం జట్టుగా దీనిని ఇలాగే కొనసాగిస్తూ ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటాం. తొలి అంచలోనే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను సుస్థిరం చేసుకోవాలి. దుబాయ్కు వచ్చిన తర్వాత ఆరు రోజుల క్వారంటైన్ మాకు చాలా కష్టంగా అనిపించింది.' అంటూ తెలిపాడు.