Advertisement

భారత్ బయోటెక్ సందర్శించిన ప్రధాని మోదీ...

By: chandrasekar Sat, 28 Nov 2020 7:37 PM

భారత్ బయోటెక్ సందర్శించిన ప్రధాని మోదీ...


కొద్దిసేపటి క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్దిపై సమీక్షించేందుకు ప్రధాని మోదీ నేడు జైడిస్ క్యాడిలా (అహ్మదాబాద్, సీరం(పుణె), భారత్ బయోటెక్(హైదరాబాద్) సంస్థలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉదయం అహ్మదాబాద్‌లోని జైడిస్ క్యాడిలా బయోటెక్ పార్క్‌ను మోదీ సందర్శించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హకీంపేట చేరుకున్నారు. అక్కడ సీఎస్ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో పాటుమరికొందరు మాత్రమే ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ నేరుగా హకీంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఆయన నేరుగా జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌కు చేరుకున్నారు. అక్కడ శాస్త్రవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ అభివృద్ది ఏ దశలో ఉందో స్వయంగా తెలుసుకోవడంతో పాటుగా పలు అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.

భారత్ బయోటెక్ సందర్శన అనంతరం ఆయన తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అనంతరం పుణేలో సీరం సంస్థకు వెళ్లి అక్కడ ఆ సంస్థ అభివృద్ది చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి మోదీ నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక, ప్రధాని మోదీ దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ది చేస్తున్న సంస్థలకు వెళ్లి సమీక్ష నిర్వహించడం తీవ్ర ఆసక్తిని రేపుతోంది. అయితే ఢిల్లీ చేరుకున్నాక మోదీ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.

Tags :
|
|

Advertisement