త్వరలో అమ్మాయిల పెళ్లి వయసు పెంపు పై ప్రధాని మోడీ ప్రకటన
By: chandrasekar Sat, 17 Oct 2020 10:04 AM
అమ్మాయిలు 18
ఏళ్లకే పెళ్లి చేసుకోవడం వల్ల చిన్న వయసులోనే పిల్లల్ని కనడంతో ఆరోగ్యపరంగా పలు
సమస్యలు వస్తున్నాయని ఇందు కోసం పెళ్లి వయసు పెంపు పై త్వరలోనే ప్రధాని మోడీ నిర్ణయం ప్రకటించనున్నారు.
అమ్మాయిల పెళ్లి వయసు పెంపు గత కొన్ని రోజులుగా దేశంలో ఇది చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై నిపుణులతో కమిటీని నియమించడమే అందుకు కారణం. బడ్జెట్
ప్రసంగంలోనే దీనిపై ప్రకటన చేయగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశ ప్రజలను
ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో అమ్మాయిల పెళ్లి కనీస వయస్సు అంశాన్ని
మరోసారి ప్రస్తావించారు. ఈ అంశంపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని
మరోసారి ప్రకటన చేశారు. అమ్మాయిల పెళ్లికి సరైన వయస్సు నిర్ణయంపై ఇప్పటికే ఏర్పాటు
చేసిన కమిటీ చర్చలు జరుపుతోంది. కమిటీ ఏం సిఫారసులు చేసిందని దేశవ్యాప్తంగా పలువురు
మహిళల నుంచి నాకు ప్రశ్నలు వస్తున్నాయి. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత సాధ్యమైనంత
తొందరగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)
75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ
శుక్రవారం, అక్టోబర్ 16 న రూ.75 స్మారక నాణేన్ని విడుదల చేశారు.
అమ్మాయిల పెళ్లి వయసు
గురించి ఈ సందర్భంగా మాట్లాడుతూ అయన ప్రస్తావించారు. ఈ సమయంలో ప్రధాని మోదీ ఈ
విధంగా స్పందించారు. ప్రస్తుతం అమ్మాయిల కనీస పెళ్లి వయసు 18
ఏళ్లుగా, అబ్బాయిల
పెళ్లి వయసు 21 ఏళ్లుగా ఉంది. అమ్మాయిల పెళ్లి వయసును 21
ఏళ్లకు పెంచుతారని అధిక మంది భావిస్తున్నారు. అమ్మాయిలకు 18
ఏళ్లకే వివాహం చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. మహిళలు కెరీర్ పరంగా
ఎదగడానికి ఇదొక అవరోధంగా మారిందని చెబుతున్నారు. అంతేకాకుండా 18
ఏళ్లకే పెళ్లి చేసుకోవడం వల్ల అమ్మాయిలు చిన్న వయసులోనే పిల్లల్ని కనడంతో
ఆరోగ్యపరంగా పలు సమస్యలు వస్తున్నాయని వివరిస్తున్నారు. అమ్మాయిలకు 18 ఏళ్లు
వచ్చే వరకు కూడా చాలా మంది తల్లిదండ్రులు ఆగట్లేదు. బాల్య వివాహాలు జరిపించి
కేసులు ఎదుర్కొంటున్నారు. మరి కనీస వివాహ వయసును పెంచితే పరిణామాలు ఎలా ఉంటాయి? మహిళల
జీవితంపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుంది? సమాజంలో
గుణాత్మక మార్పుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందా? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. కమిటీ సిఫారసు
నిర్ణయంపై ఈ విషయం ఆధారపడివుంది.