నేడు హైదరాబాద్ కు ప్రధాని మోడీ
By: chandrasekar Sat, 28 Nov 2020 11:21 AM
నేడు మన ప్రధాని నరేంద్ర
మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఇప్పుడు
హాట్ టాపిక్గా మారాయి. ఓ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో
కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు సహా జాతీయ
స్థాయి నేతలు పాల్గొంటుండమే (పరోక్షంగా ప్రధాని కూడా) ఇందుకు కారణం. జీహెచ్ఎంసీ
ఎన్నికల నేపథ్యంలో ఒక వర్గం ఓట్లను ఆకర్షించడమే ప్రధాన ఎజెండగా ప్రచారం
నిర్వహిస్తున్నది బీజేపీ! అయితే ప్రచారానికి రోజుకో ఢిల్లీ నాయకుడిని హైదరాబాద్
గల్లీల పొంటి తిప్పుతున్నది. గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఈ మునిసిపల్ ఎన్నికలకు
ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతీ ఇరానీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్, బీజేపీ
జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చివెళ్లారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ
ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలు ప్రతిరోజూ
చేస్తున్న హంగామా చూస్తూనే ఉన్నాం. ఇక పోలింగుకు ముందు వీరికి పార్టీ జాతీయ నేతలు
కూడా తోడవుతుండటం విశేషం. తాజాగా పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర
హోం మంత్రి అమిత్ షా పర్యటన కూడా ఖరారయ్యింది. అమిత్ షా రేపు హైదరాబాద్లో
పలుచోట్ల రోడ్ షోలు, దేవాలయ సందర్శనలు, పార్టీ, మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. వీరందరకి తోడు
ఇవాళ ప్రధాని మోదీ హైదరాబాద్లో పర్యటించనున్నారు.
భారత్ బయోటెక్లో
జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ పురోగతిని గురించి తెలుసుకోవడానికి మన ప్రధాని ఇక్కడకు
రానున్నారు. కాగా, ప్రధాని ఆహ్వాన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా, రాజకీయ
నేతలను దూరంపెట్టారు. అయితే ఈ పర్యటన సందర్భంగా ప్రధాని ఏమి మాట్లాడుతారనే విషయంపై, సరిగ్గా
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగియడానికి రెండు రోజుల ముందు, అదీ
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరుగుతున్న వేళ ఆయన
నగరానికి రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా, ఇదంతా బీజేపీ ఎన్నికల
స్టంట్లో భాగమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ పార్టీలు ఎన్నికల్లో విజయం
కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.