ఆ తప్పిదం వల్లనే మేము ఓడిపోయాము ..ఫైర్ అయిన ప్రీతీ జింటా
By: Sankar Mon, 21 Sept 2020 2:54 PM
క్రికెట్ లో బాట్స్మెన్ పరుగు తీసేప్పుడు ఒక్కోసారి సరిగా బాట్ క్రీజ్ లో పెట్టకుండానే రెండో రన్ కు పరుగెడతారు..అంపైర్ లు ఇది గమనిస్తే ఆ రన్ ను పరిగణలోకి తీసుకోరు..అలాంటప్పుడు ఆ ఒక పరుగెగ ఏముంది అని బాట్స్మెన్ కూడా సరిగా పట్టించుకోరు..అయితే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆ ఒక్క పరుగు వల్లనే కింగ్స్ ఎలెవెన్ ఓడిపోయింది , ఢిల్లీ గెలిచి పాయింట్ల కాత తెరిచింది..
పంజాబ్ చేజింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్లో ఫీల్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పడు సోషల్ మీడియాలో వివాదాస్పదమైంది. రబాడా వేసిన 19వ ఓవర్లో మూడవ బంతిని ఎక్స్ట్రా కవర్వైపు ఆడి రెండు పరుగులు తీశారు. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వాటిలో మొదటి పరుగు షార్ట్ రన్గా నిర్ణయించాడు. టీవీ రీప్లేలో మాత్రం పరుగును పూర్తి చేసినట్టే కనిపించింది. దీంతో మీనన్ నిర్ణయంపై పంజాబ్ యజమాని ప్రీతిజింటా అది సరైన నిర్ణయం కాదంటూ ఫైర్ అయ్యింది.
ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో.. 'నేను కరోనా మహమ్మారిని సంతోషంగా జయించాను. 6 రోజుల హోం క్వారంటైన్, 5 కోవిడ్ పరీక్షలు చిరునవ్వుతో పూర్తి చేసుకున్నాను. కానీ ఒక షార్ట్ రన్ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది. టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దాని ప్రయోజనం ఏమిటి..?. బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఇది. ఇలా ప్రతి సంవత్సరం జరగదు' అంటూ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్లో.. 'నేను ఎప్పుడూ ఆటలో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తాను. అయితే ఆటలో మరిన్ని మార్పులు, నిబంధనలు కూడా చాలా ముఖ్యం. జరిగిపోయిన విషయాలను వదిలేసి భవిష్యత్లో అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ సానుకూల థృక్పథంతో ముందుకు సాగాలి' అంటూ ట్వీట్ చేసింది.