ప్రీ మాన్సూన్ నాలాల పూడికతీత...అత్యవసర బృందాలు సిద్ధం
By: chandrasekar Sat, 08 Aug 2020 09:39 AM
నగరంలో వర్షాకాలానికి
ముందు నిర్వహించాల్సిన నాలాల పూడికతీత పనులు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు వర్షాల
కారణంగా ఎక్కడైనా ముంపు సమస్య ఏర్పడినా, నాలాల్లో
ఎక్కడైనా ప్రవాహానికి అడ్డంకులు తలెత్తినా వాటిని తొలగిస్తారు. దీనికోసం మాన్సూన్
ఎమర్జెన్సీ బృందాలను వినియోగిస్తారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు
నాలాల పూడికతీతకు జీహెచ్ఎంసీ వార్షిక షెడ్యూల్ను రూపొందించి అమలుచేస్తున్నది.
వర్షాకాలం కంటే ముందు
చేపట్టాల్సిన పనులు, వర్షాకాలం
తరువాత చేపట్టాల్సిన పనులను ఇందులో స్పష్టంగా తెలియచేసారు . ప్రస్తుతం
వర్షాకాలానికి ముందు పూర్తిచేసేందుకు నిర్దేశిత పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా
ఆరు జోన్లలో రూ.31కోట్లతో
871కిలోమీటర్ల పొడవున పూడికతీత పనులను 345భాగాలుగా విడదీసి చేపట్టారు. మొత్తం 4.79లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాలని
లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతానికి ఈ పనులు
పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ప్రీ మాన్సూన్ నాలాల పూడికతీత వల్ల
వర్షాకాలంలో పడే భారీ వర్షాలకు నీరు సాఫీగా వెళ్లి ముంపు సమస్య తలెత్తకుండా ఉండే
అవకాశం కలుగుతుంది. వర్షాలు విరివిగా పడుతున్నందున ఇప్పుడు ఎక్కడైనా నాలాల్లో
అడ్డంకులు ఏర్పడితే మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల ద్వారా వాటిని తొలగిస్తామని
అధికారులు చెప్పారు. ఈ పనులు మళ్లీ వేసవి కాలం వచ్చేవరకూ కొనసాగుతాయని, సమస్య తలెత్తిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పనులు
చేపడుతామని అధికారులు తెలియచేసారు.