ఒక కొడుకుగా అది నా హక్కు ..ప్రణబ్ ముఖర్జీ కొడుకు అభిజిత్ ముఖర్జీ
By: Sankar Wed, 16 Dec 2020 9:09 PM
దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ప్రచురణ అంశంపై చెలరేగిన వివాదంపై ఆయన తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అభిజిత్ ముఖర్జీ స్పందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో తనకేమీ అభ్యంతరం లేదని, అయితే తాను ఆ బుక్ను పూర్తిగా చదివిన తర్వాతే పబ్లిష్ చేయాలని బుధవారం పునరుద్ఘాటించారు.
ఈ మేరకు.. ‘‘కొందరు భావిస్తున్నట్లుగా, మా నాన్న చివరి జ్ఞాపకానికి సంబంధించిన అంశానికి నేనెంత మాత్రం వ్యతిరేకం కాదు. అయితే ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ గురించి తెలుసుకోవడం ఒక కొడుకుగా నాకున్న హక్కు. ఒకవేళ నాన్న బతికుండి ఉంటే, పుస్తకం పూర్తైన తర్వాత ఆయన కూడా ఇదే చేసేవారు. ఫైనల్ అవుట్పుట్ చూసేవారు. గతంలో కూడా అలాగే చేశారు. ఇప్పుడు కూడా నేను అదే చేయాలనుకుంటున్నా.
ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నా. నేను ఆ పుస్తకం చదివేంత వరకు ప్రచురణ ఆపేయండి. చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడవద్దు’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పేరిట ప్రణబ్ ముఖర్జీ రాసిన రూపా పబ్లికేషన్స్ విడుదల చేయనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.