హైదరాబాద్ లో ఇలా జరగడం గత వందేళ్లల్లో ఇది రెండోసారి మాత్రమే
By: Sankar Wed, 14 Oct 2020 07:43 AM
హైదరాబాద్ లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలో ఎప్పుడూ లేనంతగా వర్షపాతం నిన్నటి రోజున నమోదైంది. గరిష్టంగా 32 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. గత వందేళ్లలో ఇది రెండో అత్యధిక వర్షపాతం. నగరంలో కురిసిన భారీ వర్షానికి శివారు ప్రాంతాలలోని కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
చెట్లు, కటౌట్లు, హోర్డింగ్ ల కింద ఎవరూ నిలబడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎమర్జెన్సీ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి. మరికొన్ని గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సబ్స్టేషన్లలోకి మంగళవారం వరద నీరు చేరింది. ఫలితంగా ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. మల్లాపూర్లో కరెంట్ తీగలు తెగిపడి తెనాలికి చెందిన ఫణికుమార్ (35) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నాచారంలోని లిక్కర్స్ ఇండియాలో పనిచేస్తున్నాడు. ఓల్డ్సిటీ అంతా అంధకారంలో ఉండిపోయింది.