Advertisement

  • ఇది పనికిరాదని అనుకోకూడదు.. కాస్త ఆలోచిస్తే...చెత్తతో ‘పవర్‌' తయారీ ప్లాంటు ఏర్పాటు

ఇది పనికిరాదని అనుకోకూడదు.. కాస్త ఆలోచిస్తే...చెత్తతో ‘పవర్‌' తయారీ ప్లాంటు ఏర్పాటు

By: chandrasekar Tue, 10 Nov 2020 4:41 PM

ఇది పనికిరాదని అనుకోకూడదు.. కాస్త ఆలోచిస్తే...చెత్తతో ‘పవర్‌' తయారీ ప్లాంటు ఏర్పాటు


పనికిరావని అనుకునే వ్యర్థాలన్నీ ఏదో పనికి ఉపయోగ పడుతాయి. నగరంలో పడకేస్తున్న పారిశుధ్యానికి పనిచెప్పుతూ.. ఇప్పటివరకు వ్యర్థాలతో టైల్స్‌, గృహోపకరణాలు తయారు చేసి వినియోగంలోకి తీసుకువచ్చిన జీహెచ్‌ఎంసీ మరో అడుగు ముందుకేసింది. నిమిషం కూడా పోకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆసరాగా నిలుస్తున్నది. ఇన్నాళ్లు గుట్టలను తలపిస్తూ తీవ్రమైన దుర్గంధంతో ప్రజలను అతలాకుతలం చేసిన చెత్తనే ఇప్పుడు ‘పవర్‌' తయారీకి ఉపయోగపడుతున్నది. ఇందుకు నగర శివారు జవహర్‌నగర్‌ వేదికైంది. జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌ సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్‌ వ్యర్థాలతో విద్యుత్ ‌(వేస్ట్‌ టూ ఎనర్జీ) ను ఉత్పత్తిచేసే ప్లాంటు ప్రారంభానికి సిద్ధమైంది. 19.8మెగావాట్ల సామర్థ్యంగల ఈ ప్లాంటును మంగళవారం పురపాలక శాఖ మంత్రి కే.టీ.రామారావు ప్రారంభించనున్నారు. అయితే దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం.

ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంటును హైదరాబాద్ లో ఏర్పాటుచేయాలని జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో మధ్య ఒప్పందం ఉంది. ఇందులో భాగంగా మొదటి దశలో 19.8మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంటును ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణానికి ఎటువంటి నష్టం జరుగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం(రెఫ్యూజ్‌ డీరైవ్డ్‌ ఫ్యూల్‌, ఆర్‌డీఎఫ్‌)తో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. బెల్జియంకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్లాంటును ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. గత ఆగస్టు 20వ తేదీనుంచే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం కాగా, ఇప్పటివరకు సుమారు కోటిన్నర యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు, ఒక్కో యూనిట్‌ రూ.7.40చొప్పున ట్రాన్స్‌కోకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాబోయే ఐదేండ్లలో నగరంలో వెలువడనున్న వ్యర్థాలతో 98మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసే వీలు కలుగుతుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండోదశలో ప్లాంటును 48మెగావాట్ల మేరకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతులు మంజూరుచేసినట్లు తెలిపారు. ఇదికాకుండా 14.5మెగావాట్ల సామర్థ్యంగల మరో ప్లాంటును దుండిగల్‌లోని టీఎస్‌ఐఐసీ స్థలంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే పనులు కూడా మొదలయ్యాయని అధికారులు వివరించారు. జవహర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పవర్‌ప్లాంట్‌ను మంగళవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పవర్‌ ప్లాంట్‌ను మంత్రి మల్లారెడ్డి సోమవారం సందర్శించి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి, జవహర్‌నగర్‌ మేయర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ శ్రీనివాస్‌, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :
|

Advertisement